హైదరాబాద్,క్రైమ్ మిర్రర్: జుబ్లీహిల్స్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం దివ్యమంగళ హారతుల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామిని పుష్పాలతో, పతాకాలతో అలంకరించిన మహారథంలో భక్తులకు దర్శనం కల్పించారు.
భక్తులు మంగళ హారతులు సమర్పించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా రథోత్సవం వేల గోవిందా గోవిందా నామస్మరణ పరిసర ప్రాంతాల్లో మారు మ్రోగింది. భక్తుల భజనలు, కోలాటాలు పలువురిని ఆకర్షించాయి. ఈ దివ్య ఉత్సవ శ్రేణిలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారు అశ్వవాహనంపై విహరిస్తూ భక్తులకు పుణ్యదర్శనం అనుగ్రహించనున్నారు.

