దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాలతో గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్నీ పండుగ వాతావరణంతో కళకళలాడాయి. శోభాయాత్రలు, హారతులు, వేద మంత్రోచ్ఛారణలతో ప్రతి చోటా ఆధ్యాత్మిక కాంతి విరాజిల్లింది. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో చోటుచేసుకున్న ఒక విశేష ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇల్లందులోని నాగుల్ మీరా దర్గాలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా సీతారాముల కల్యాణాన్ని హిందూ, ముస్లింలు కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా వేదికపై నైవేద్యంగా ఉంచిన ఫలహారాలను ఒక ఉడుత వచ్చి భుజించడం అక్కడున్న వారందరినీ పరవశింపజేసింది.
ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు దీనిని దైవ సూచనగా భావిస్తూ ఆనందంతో మునిగిపోయారు. స్థానికుల సమాచారం ప్రకారం.. ఈ దర్గాలో ప్రతి ఏడాది జరిగే సీతారాముల కల్యాణోత్సవ సమయంలో ఉడుత వచ్చి ఇలాగే నైవేద్యం స్వీకరించడం ఒక సంప్రదాయంగా కొనసాగుతోందని చెబుతున్నారు. ఈ ఘటనను అక్కడున్న వారు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఈ ఘటన మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ, హిందూ, ముస్లిం ఐక్యతను మరొకసారి చాటి చెప్పింది. దర్గాను ముస్లిం సోదరులు అలంకరించి, ఏర్పాట్లు చేయడం, హిందూ సంప్రదాయ పద్ధతిలో కల్యాణం నిర్వహించడం విశేషంగా నిలిచింది.
ఇక దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో కూడా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన కళ్యాణ మండపం వైకుంఠాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమ్రోగింది. భక్తుల జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది. మొత్తం మీద ఈసారి జరిగిన శ్రీరామనవమి వేడుకలు భక్తి, ఆనందం, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.
ALSO READ: పొద్దుపొద్దుగాల్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?
