Woman Cremated on Road: బిహార్ రాష్ట్రంలో మనసును కలిచివేసే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు.. వృద్ధురాలి అంత్యక్రియలను నడి రోడ్డుపై నిర్వహించారు. ఎందుకు అలా చేశారని చాలా మంది ఆరా తీశారు. అసలు విషయం తెలిసి పరేషాన్ అయ్యారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇంతీవైశాలి జిల్లాలోని సోందో వాసుదేవ్ గ్రామానికి చెందిన 91 ఏళ్ల ఝపీ దేవి అనారోగ్యంతో చనిపోయింది. మరుసటి రోజు కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఝపీ దేవి మృతదేహాన్ని శ్మశానికి తరలించారు. అయితే, శ్మశానికి వెళ్లే మార్గాన్ని స్థానిక వ్యాపారులు ఆక్రమించేశారు. అక్కడ షాపులు కట్టేశారు. ఝపీ దేవి కుటుంబ సభ్యులు శవాన్ని అక్కడినుంచి ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా.. ఆ వ్యాపారులు అడ్డుకున్నారు. ఆ రోడ్డు గుండా లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో ఝపీ దేవి కుటుంబసభ్యులు వేరే మార్గాల ద్వారా శ్మశానంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకుండా పోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వారు.. నడి రోడ్డుపైనే ఝపీ దేవికి అంత్యక్రియలు నిర్వహించారు.
దర్యాప్తు కోసం కమిటీ ఏర్పాటు
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన్ని గంటల పాటు అటు వైపు ఎవరూ రాకుండా చూసుకున్నారు. అయితే, శ్మశానానికి వెళ్లే మార్గం చాలా కాలం క్రితమే ఆక్రమణకు గురైందని స్థానికులు చెప్పారు. ఈ కారణంగా గ్రామస్తులంతా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. అధికారులకు చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఈ సంఘటనపై వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇందుకోసం ఓ కమిటీని సైతం ఏర్పాటు చేశారు. దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





