Nashik MNC Harassment Case: మహారాష్ట్రలోని నాసిక్లో ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగినులపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు మొత్తం 9 కేసులు నమోదు చేసి, ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, కంపెనీ జరుగుతున్న వ్యవహారంపై పెద్ద చర్చకు దారితీసింది.
నాలుగేళ్లుగా కొనసాగుతున్న వేధింపులు
వివరాల్లోకి వెళితే, ఈ కంపెనీలో పని చేస్తున్న మహిళలు గత నాలుగేళ్లుగా పలు రకాల వేధింపులకు గురయ్యారని వెల్లడించారు. తోటి ఉద్యోగులు పదే పదే అసభ్యంగా ప్రవర్తించడం, అనవసరంగా తాకడం, బాడీ షేమింగ్ చేయడం లాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా, కొందరు ఉద్యోగులు మతపరమైన భావాలను దెబ్బతీసేలా కూడా వ్యాఖ్యలు చేసేవారని బాధితులు వెల్లడించారు.
పట్టించుకోని యాజమాన్యం
ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. పైగా, బాస్ నిర్లక్ష్యం కారణంగా నిందితుల ప్రవర్తన మరింత దారుణంగా తయారైందని బాధితులు చెప్పారు. ఒక నిందితుడు ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో మహిళా ఉద్యోగిని అసభ్యంగా తాకడమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం, రూపం గురించి కూడా అవమానకరంగా మాట్లాడినట్టు వెల్లడించారు. ఈ వేధింపులు కేవలం మహిళలకే కాకుండా, కొంతమంది పురుష ఉద్యోగులపైనా మాటల దాడుల రూపంలో కొనసాగినట్లు సమాచారం.
పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఈ పరిస్థితులను భరించలేక బాధితులు చివరకు నాసిక్ పోలీసులను ఆశ్రయించారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేశారు. ఇప్పటికే అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారికి పోలీస్ కస్టడీ విధించారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ముందుకు రావాలని పోలీసులు సేచించారు. ఈ ఘటనతో బహుళజాతి సంస్థల్లో ఉద్యోగుల భద్రత, ముఖ్యంగా మహిళల రక్షణపై మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
