తెలంగాణ

ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఇవాళే సుప్రీం తుది తీర్పు!

Supreme Court verdict: తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ పార్టీ ఫిరాయించారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, కౌశిక్‌ రెడ్డి, వివేకానంద, జీ జగదీశ్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌, కల్వకుంట్ల సంజయ్‌ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. ఈ వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్‌ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్‌ 3న తీర్పును రిజర్వ్‌ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డిపై జస్టిస్ గవాయ్ ఆగ్రహం   

ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్‌ గవాయ్‌.. జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ తో కలిసి తుది తీర్పును వెలువరించనున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీం కోర్టులో విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్‌ అసెంబ్లీలో ప్రస్తావించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సంయమనం పాటించలేరా? ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెబుతారు? అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్‌ కాలయాపనపైనా అసహనం వ్యక్తం చేశారు. నాలుగేళ్లు స్పీకర్‌ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలా?  అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read Also: మణిపూర్‌ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు, లోక్ సభ ఆమోదం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button