
బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సవరణ పేరుతో భారీగా ఓట్ల తొలగింపునలకు పాల్పడితే, తాము వెంటనే జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం అనేది రాజ్యాంగ సంస్థ అని, చట్ట ప్రకారం పని చేస్తుందని భావిస్తున్నామని జస్టిస్ సూర్యకాంత మిశ్రా, జస్టిస్ బాగ్చి ధర్మాసనం వెల్లడించింది. ఓటర్ల సవరణ ప్రక్రియను సవాల్ చేస్తూ, దాఖలైన పిటిషన్లపై ఆగష్టు 12, 13 తేదీల్లో విచారణ చేపడుతామని పేర్కొంది.
65 లక్షల ఓట్ల తొలగింపు!
ఈ కేసుకు సంబంధించి పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఆగస్టు 1న ఎన్నికల కమిషన్ ప్రచురించే ఓటర్ల ముసాయిదా జాబితాలో చాలా మంది ఓటర్లను తొలగిస్తున్నారని, దీని వలన నిజమైన వారు ఓటు హక్కును కోల్పోతారని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ సమయంలో 65 లక్షల మంది ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించలేదని, వారు చనిపోవడమో, వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడమే జరిగిందంటూ ఈసీ ఒక ప్రకటన చేసిందని భూషణ్ వెల్లడించారు. వీరంతా ఓటర్ల జాబితాలో చేరడానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
తప్పు జరిగితే, జోక్యం చేసుకుంటాం!
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ర మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ రాజ్యాంగబద్ధ సంస్థ అన్న న్యాయమూర్తి.. ఏమైనా తప్పులు జరిగితే జోక్యం చేసుకుంటామని చెప్పారు. భారీ ఎత్తున ఓట్లు తొలగింపునకు గురైతే తగిన చర్యలు చేపడుతామన్నారు. ఓటర్ల తొలగింపు లిస్టులో 15 మంది బతికున్నట్లుగా మీరు చూపించండి జోక్యం చేసుకంటామని జస్టిస్ బాగ్చి వెల్లడించారు. ఈసీ తరఫున రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ముసాయిదా జాబితా ప్రచురణ తర్వాత కూడా ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు, ఈసీ ఆగస్టు 8లోగా రాతపూర్వక అఫిడవిట్ ఇవ్వాలని ధర్మాసనం సూచించింది.