
Telangana Rythu Bharosa: అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి రైతు భరోసా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయని వెల్లడించింది. వానాకాలం పెట్టుబడి సాయం కోసం ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. గత బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పేరుతో ఎకరాకు రూ. 10,000 పెట్టుబడి సాయంగా అందించగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ. 12,000 అందిస్తోంది. ఒక్కో సీజన్ కు రూ. 6,000 చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఏడాదికి రెండుసార్లు ఈ డబ్బులను రైతులకు అందిస్తున్నారు. ఈ వానాకాలం సీజ్ కు గాను నేటి నుంచి ఈనెల 25 వరకు విడుదల వారీగా రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం నిధులు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
3.5 ఎకరాల వరకే రైతు భరోసా!
ఇవాళ సాయంత్రం సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాతలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియం నుంచి ఆయన రైతులతో మాట్లాడుతారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. గత సీజన్ లో కేవలం 3.5 ఎకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 4 ఎకరాలు, అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా రికార్డులలో పేరు నమోదు అయిన రైతులకు ఈనెల ఆఖరులోగా డబ్బులు అకౌంట్లలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతుల పేర్లను రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోంది.
Read Also: గవర్నమెంట్ హాస్పిటల్ లో కలెక్టర్ కు ఆపరేషన్, సర్వత్రా అభినందనలు!