* గ్రేటర్ కార్పొరేషన్ లకు విడివిడిగా ఎన్నికలు
* ఒకచోట ఫలితం మరోచోట ప్రభావితం చేయాలన్నది వ్యూహం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పరిధిలో మూడు కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారా? లేకుంటే మూడు నగరాలకు వేర్వేరుగా నిర్వహిస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. గ్రేటర్ హైదరాబాద్ ను కొద్ది రోజుల కిందట మూడు కార్పొరేషన్లగా విభజించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉమ్మడిగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఉంటుందా? లేకుంటే విడిగా పెడతారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే విడివిడిగానే ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
ఆ రెండు పార్టీలకు ధీటుగా..
గత గ్రేటర్ ఎన్నికల్లో పట్టు బిగించింది బిఆర్ఎస్. బల్దియా ఎన్నికల్లో గ్రేటర్ మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అనూహ్యంగా పుంజుకుంది. అందుకే గ్రేటర్ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధానంగా డివిజన్లను పెంచడం ద్వారా ఏ ఒక్క రాజకీయ పార్టీకి ఏకపక్షంగా పట్టు చిక్కకుండా చేయాలన్నది సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలోని బలమైన ఓటు బ్యాంకులను మొక్కలు చేయడం ద్వారా రాజకీయ శక్తిని వికేంద్రీకరించాలని చూస్తోంది. మల్కాజ్గిరి వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో ఇంకా పటిష్టమైన యంత్రాంగం సిద్ధం కాలేదు. అక్కడ ఇప్పటికీ గులాబీ పార్టీతో పాటు బిజెపి బలంగా ఉన్నాయి. ఒకేసారి ఎన్నికలకు వెళ్తే ఎదురు దెబ్బ తగిలి ప్రమాదం ఉంది. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. తమకు అనుకూలమైన చోట ముందుగా.. ప్రతికూలత ఉన్నచోట నిదానంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్ర మూలాలు ఉన్న ప్రాంతాలు..
గ్రేటర్ పరిధిలో ఆంధ్ర సెటిలర్స్ కీలకం. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి చోట్ల ఆంధ్రమూలాలు ఉన్న వాటర్లు అధికంగా ఉంటారు. అక్కడ ఎప్పుడూ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లో గెలుపు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. అందుకే తక్షణమే ఎన్నికలకు వెళ్లకుండా.. అక్కడ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రత్యేక అభివృద్ధి పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. సైబరాబాద్ పరిధిలో మౌలిక వసతుల కల్పన ద్వారా వారి విశ్వాసాన్ని పొందాక ఎన్నికలు బరిలో దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మూడు కార్పొరేషన్ల పరిధిలో 99 రోజుల ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణను ప్రకటించారు. ఈ మూడు నెలల గడువులోనే వీలైనంత త్వరగా అభివృద్ధి పనులను పట్టాలెక్కించాలని చూస్తున్నారు.
భారీ ఎత్తుగడ..
మూడు కార్పొరేషన్ల కు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరపడం ద్వారా.. ఒక ప్రాంతంలో వచ్చిన ఫలితం లేదా ప్రభావాన్ని మరో ప్రాంతంలో తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నది కాంగ్రెస్ ఎత్తుగడగా తెలుస్తోంది. ప్రతిపక్షాల ఏకాగ్రతను దెబ్బతీయటమే టార్గెట్ గా ఈ వ్యూహం అమలు చేయబోతున్నారు. అధికార యంత్రాంగాన్ని ఒకే చోట కేంద్రీకరించి గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి త్రిశూల వ్యూహంతో మూడు మేయర్ పీఠాలను దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
