
తెలంగాణలోని పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు పథకంలో ఒక వింత సమస్య ఎదురవుతోంది. సొంత స్థలం ఉన్న నిరుపేదలు నిర్మించుకుంటున్న ఇళ్ల విషయంలో ప్రభుత్వం పెట్టిన కొలతల గీత దాటితే వారిని అనర్హులుగా ప్రకటిస్తున్నారు. సరైన అవగాహన లేక.. ఉన్నంత స్థలంలో ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇది పెద్ద షాక్గా మారుతోంది. లభిదారులకు అధికారులు ముందుగా ఇంటి నిర్మాణంపై స్పష్టమైన అవగాహన కల్పించకపోవడంతోనే ఈ సమస్య తలెత్తుతోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
ప్రభుత్వం మొదట్లో చెప్పిన దాని ప్రకారం.. సొంత జాగా ఉన్న పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు. దీని కోసం ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే కొంతమంది లబ్ధిదారులు ఈ నిబంధనను సరిగ్గా తెలుసుకోలేకపోయారు. తొందరపాటులో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు వారికి మొదటి విడతగా వచ్చే లక్ష రూపాయలు నిలిచిపోయాయి. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు కట్టుకున్నవారు పేదవారు కారని, వారికి ఈ పథకం వర్తించదని అధికారులు తేల్చి చెబుతున్నారు.
దీంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు సొంత స్థలం ఉంది కనుకనే ఇల్లు కట్టుకుంటున్నామంటున్నారు. కానీ తాము ధనికులం కాదంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిబంధనల గురించి తమకు అవగాహన లేదంటున్నారు. తెలిసుంటే ప్రభుత్వం చెప్పిన కొలతల్లోనే కట్టుకునేవాళ్ళ మంటున్నారు. ఆ విషయంలో తమ లేదని, ఆ కారణంగా తమకు సహాయం నిలిపివేయడం అన్యాయమంటున్నారు. . ప్రభుత్వం ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిశీలించి, తమకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది లబ్ధిదారులు ఇలా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో చాలామంది పేదవారు అయోమయంలో పడేసింది. అయితే నిబంధన పక్రారం 600 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలంలోనే ఇంటి నిర్మాణం చేపట్టాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలా వుండగా తెలంగాణలో ఇప్పటికే మొదటి విడత కింద లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగా.. త్వరలోనే రెండో జాబితాను విడుదల చేయనుంది ప్రభుత్వం.