
Pune Bridge Collapsed: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణే మావాల్ లోని ఇంద్రాణి నదిపై ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జి కూలడంతో ఆరుగురు మృతి చెందారు. 25 మంది గల్లంతయ్యారు. మావాల్.. పూణే పరిసరాల్లోని ఓ ప్రముఖ పర్యాటక కేంద్రం. నిత్యం ఈ ప్రదేశానికి ఎంతో మంది వస్తుంటారు. ఇదే ప్రాంతంలో ఇంద్రాణి నది మీద ఓ వంతెన ఉంటుంది. ఈ రోజు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యతో పర్యాటకులు తరలి వచ్చారు. చాలా మంది బ్రిడ్జి మీదికి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు చనిపోగా, చాలా మంది గల్లంతయ్యారు. స్థానికులు కొందరిని కాపాడారు.
వంతెన ఎందుకు కూలిందంటే?
ఇంద్రాణి నది మీద ఉన్న వంతెన చాలా పాతకాలం నాటిది. శిథిలావస్థకు చేరింది. పెద్ద సంఖ్యలో బ్రిడ్జి మీదికి ఎక్కడంతో బరువు ఎక్కువై కూలిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో పలువురు చిన్న పిల్లలు సైతం గల్లంతు అయినట్లు తెలుస్తోంది.
ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ ఘటన గురించి తెలియడంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే, గల్లంతు అయిన వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రతి శని, ఆదివారాలు ఎక్కువ సంఖ్యలో పర్యాటకలు తరలి వస్తున్నప్పటికీ, అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అయినట్లు స్థానికులు చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురవడంతో ఇంద్రాణి నదీ ప్రవాహం పెరిగింది. ఆ నీటిని చూసేందుకు సందర్శకులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జి మీద 500 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: ‘కాంతార-2’ షూటింగ్ లో ప్రమాదం, తృటిలో బయటపడ్డ రిషబ్!