* డిజిటల్ మీడియా ప్రారంభించనున్నట్లు వెల్లడి
* వైసిపి హయాం నుంచి ఇటువంటి ప్రకటనలు
* ఎట్టకేలకు కార్యాచరణ మొదలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియా వ్యాపారంలో అడుగుపెడుతున్నారు. ఏడాది కిందట ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇకనుంచి రాజకీయాలు చేయనని.. రాజకీయాలు మాట్లాడనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ ఆ మాట మీద నిలబడలేకపోయారు. ఏడాది తిరగకముందే తాను రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తోందని.. త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతానని కూడా ప్రకటించారు విజయసాయిరెడ్డి. అయితే ఇప్పుడు మీడియా రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు. అయితే అది డిజిటల్ మీడియా అని తేల్చి చెప్పారు.
ఎప్పటినుంచో సన్నాహాలు..
విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే సొంతంగా మీడియా పెడతానని ప్రకటించారు. అప్పట్లో దీనిని ఆశ్చర్యంగా చూశారు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా అండగా ఉంది. మళ్లీ విజయసాయిరెడ్డి ఎందుకు పెడతారు అని ప్రశ్న ఉత్పన్నమైంది. మరోవైపు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావులు మీడియా ఉందని చెప్పి ఇబ్బంది పెడుతున్నారని.. అందుకే తాను ఒక మీడియాను ప్రారంభిస్తానని విజయసాయిరెడ్డి చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. విజయసాయి రెడ్డి పై వ్యక్తిగత ఆరోపణలు వచ్చిన క్రమంలో.. అప్పట్లో కూడా ఆయన మీడియాను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం మీడియాను ప్రారంభిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలపడం విశేషం.
సాక్షి ఏర్పాటులో కీలక పాత్ర
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో ఆయన జర్నీ ప్రారంభం అయింది. రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సొంతంగా ఒక పత్రిక ఉండాలని భావించి సాక్షిని ప్రారంభించారు. తర్వాత టీవీ ఛానల్ ను సైతం మొదలుపెట్టారు. అప్పట్లో వీటీ ఏర్పాటు వెనుక విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసుల్లో జగతి మీడియా పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఏ పార్టీలో చేరలేదు విజయసాయిరెడ్డి. కూటమి పార్టీల నుంచి సానుకూలత రాలేదు. అలాగని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్లలేరు విజయసాయిరెడ్డి. అందుకే తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి బలంగా నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. త్వరలో డిజిటల్ మీడియాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. క్రమేపీ మెయిన్ మీడియా గా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది.
