పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ కీలక దౌత్య చర్యలు ప్రారంభించారు. పలు దేశాధినేతలతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా సంయుక్త ప్రయత్నాలు అవసరమని స్పష్టం చేశారు.
చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం
ముఖ్యంగా ఇమ్మాన్యుయెల్ మేక్రాన్తో మాట్లాడిన మోదీ, పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయని, వీటిని తగ్గించడానికి చర్చలు మరియు దౌత్యమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ అల్ సయీద్తో కూడా ఆయన మాట్లాడి, ఆ దేశ ప్రజలకు ముందస్తుగా ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఒమన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే చర్యలను ఖండిస్తూ, శాంతి, సుస్థిరత పునరుద్ధరణ అవసరాన్ని నొక్కిచెప్పారు.
యూఏఈ అధ్యక్షుడు అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తోనూ, జోర్డాన్ రాజు అబ్దుల్లా-2తోనూ మోదీ చర్చలు జరిపారు. ప్రాంతంలో ఇంధన వనరులపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సహకారంతో శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతోనూ కూడా మోదీ సంప్రదింపులు జరిపారు. యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న దృష్ట్యా, సమన్వయంతో ముందుకు సాగాలని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. ఈ దౌత్య చర్చల ద్వారా భారత్ శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సంభాషణ, సహకారం ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు.
