
Trump On Modi: పూటకో మాట మాట్లాడ్డం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలవాటుగా మారిపోయింది. భారత్ ను, రష్యాను చీకటి చైనాకు కోల్పోయాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె, 24 గంటలు గడవక ముందే నాలిక మడతేశారు. మోడీ ఎప్పుడూ తన స్నేహితుడేనని చెప్పుకొచ్చారు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధాలు ఉన్నాయన్నారు. వైట్ హౌ్స్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత్-అమెరికా సంబంధాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు కీలక వ్యాఖ్యలు చేశారు. “‘నేనెప్పటికీ మోడీకి మిత్రుడిగా ఉంటాను. ఆయనో గొప్ప ప్రధాని. కాకపోతే.. ప్రస్తుతం ఆయన చేస్తున్న పనే నాకు నచ్చట్లేదు. కానీ, భారత్-అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది. రెండు దేశాల సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు. కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు వస్తాయి అంతే’’ అన్నారు.
భారత్ తీరు నిరాశకు గురి చేసినా..
అటు రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం తనను నిరాశకు గురి చేసిందన్నారు ట్రంప్. ‘అందుకే భారత్ పై 50 శాతం సుంకాలు విధించామన్నారు. అది చాలా ఎక్కువ టారిఫ్ అని తెలిసినా తప్పలేదన్నారు. అయినా, ప్రధాని మోడీతో బాగా కలిసిపోతానని చెప్పారు. ఆయన చాలా గొప్పవారు అంటూ ప్రశంసించారు. భారత్ తో పాటు చాలా దేశాలతో వాణిజ్య చర్చలు జరుగుతున్నాయన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ
భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని.. చిన్నచిన్న విభేదాలున్నా అవి సర్దుకుంటాయన్న ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందించారు. ట్రంప్ అభిప్రాయాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని.. తాను కూడా అదే భావాలతో స్పందిస్తున్నానని వెల్లడించారు. ‘‘భారత్- అమెరికా మధ్య అత్యంత సానుకూలమైన, ముందుచూపుతో కూడిన సమగ్ర అంతర్జాతీయ స్థాయి వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది’’ అని మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.