
PM Modi UK, Maldive Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ఈ టూర్ కొనసాగనుంది. బ్రిటన్ తో పాటు మాల్దీవులలో ప్రధాని పర్యటించనున్నారు.
23-24 తేదీల్లో ప్రధాని బ్రిటన్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ జులై 23, 24 తేదీల్లో బ్రిటన్ లో పర్యటించనున్నారు. యూకే పర్యటన సందర్భంగా భారత ప్రధాని మోడీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తో పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చలు జరుగనున్నాయి. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతికత, ఆవిష్కరణ, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చలుంటాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ పర్యటన సందర్భంగా కింగ్ చార్లెస్-3ని కూడా ప్రధాని మోడీ కలిసే అవకాశం ఉంది. రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, పురోగతిపై వారిద్దరు చర్చించనున్నాయి.
25-26 తేదీల్లో మోడీ మాల్దీవుల పర్యటన
రెండు రోజుల బ్రిటన్ పర్యటన తర్వాత ప్రధాని మోడీ జూలై 25, 26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మోయిజ్జు ఆహ్వానంతో ప్రధాని మాల్దీవుల పర్యటనకు వెళ్లబోతున్నారు. అధ్యక్షుడు మోయిజ్జు మాల్దీవుల్లో అధికారం చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. జూలై 26న జరిగే మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రధానమంత్రి మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య పలు కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. భారత్- మాల్దీవులు ఉమ్మడి ఆర్థిక, సముద్ర భద్రతా ఒప్పందంపై పురోగతిపై చర్చించనున్నారు. 2024 అక్టోబర్ లో మొయిజ్జు ఇండియా పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది.
Read Also: భార్యను వదిలేసి వెళ్లిన కేంద్రమంత్రి, మరీ అలా మర్చిపోతే ఎలా సర్?