
PM Kisan Samman Nidhi: దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు మోడీ సర్కారు శుభవార్త చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదరు చూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది. 20వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది.
నిధులు విడుదల చేయనున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద శనివారం (ఆగస్టు 2న) రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కానుంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకం కోసం 20వ విడత నిధుల కింద రూ.20,500 కోట్లు విడుదలయ్యాయి. దీని ద్వారా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. వారాణసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నగదును రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష జరిపారు. రైతుల ఖాతాకు ఏటా రూ.6,000 చొప్పున మూడు వాయిదాల్లో జమ అవుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఈ నిధులను జూలై 17నే విడుదల చేస్తారనే ఊహాగానాలు వినిపించినా, చేయలేదు.
ఏపీలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజనతో పాటు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను విడుదల చేయాలని భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం రూ. 5 వేలు చొప్పున రెండు సార్లు, రూ. 4 వేలు చివరి విడతలో అందించనుంది. పీఎం నిధులతో కలిపి ఏడాదిలో రైతు ఖాతాలో రూ. 20 వేలు జమ కానున్నాయి. ఇక నుంచి ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిసి తొలి విడతగా ఏప్రిల్ – జులై, రెండో విడతగా ఆగస్టు- నవంబర్, మూడో విడతగా డిసెంబర్-మార్చిలో చెల్లింపులు చేయనుంది. రేపు పీఎం కిసాన్ నిధులు విడుదల ఖాయమని చెబుతున్న అధికారులు.. ఆ సమయంలోనే అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రెడీ అవుతున్నారు.
Read Also: శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద, సాగర్ లోకి కృష్ణమ్మ పరుగులు!