- విమాన ప్రయాణీకులకు అలర్ట్
- ఇకపై విమానంలో గట్టిగా పాటలు వింటే చర్యలు
- కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం
విమాన ప్రయాణాలు మరింత ఆహ్లాదకరంగా కొనసాగేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు నిబంధనలు అమల్లో ఉండగా, ఇప్పుడు మరో కొత్త రూల్ ను పాస్ చేసింది. విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ, ఇయర్ ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు వినేవారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. ఇలాంటి సందర్భాల్లో సదరు ప్రయాణికుడిని అన్ రూలీ ప్యాసెంజర్ గా పరిగణించి విమానం నుంచి దించేయడంతో పాటు భవిష్యత్తులో ప్రయాణించకుండా నిషేధించడం వంటి చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
లోక్ సభలో కీలక విషయాలు వెల్లడించిన విమానయాన మంత్రి
లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిస్తూ, క్రమశిక్షణారహితంగా ప్రవర్తించే ప్రయాణికులపై చర్యలు తీసుకునేందుకు ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్1937 కింద ఇప్పటికే నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ముందస్తు అనుమతి లేకుండా విమానాశ్రయాల్లో, విమానంలో ఉన్నప్పుడు ఫొటోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని ఆయన గుర్తు చేశారు. ప్రయాణీకులంతా విమానయాన నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని సూచించారు.
రైళ్లలోనూ ఇలాంటి తరహా నిబంధనలు
రైళ్లలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. రాత్రిపూట 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా కీలక రూల్స్ అమలు చేస్తుంది. అయితే, ఫోన్లలో లౌడ్ స్పీకర్ పెట్టి గట్టిగా మాట్లాడ్డం, పెద్దగా సౌండ్ పెట్టి పాటలు వినడం లాంటివి చేస్తే, జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత ఇలాంటి పని చేస్తే సీరియస్ యాక్షన్ ఉంటుంది. తాజాగా ఇదే నిబంధన విమానాల్లోనూ అమలు చేసేందుకు విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.
Read Also: మహిళా జర్నలిస్ట్ హత్య కేసు.. ఎనిమిదేళ్ల తర్వాత బయటపడ్డ అసలు కథ!
