తెలంగాణరాజకీయం

Panchayathi Elections: కూతురు సర్పంచ్, తండ్రి ఉప సర్పంచ్!

Panchayathi Elections: రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది.

Panchayathi Elections: రెండో విడత సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ గ్రామీణ రాజకీయాల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. తాజాగా జనగామ జిల్లా జనగామ మండలం వెంకిర్యాల గ్రామ పంచాయతీలో జరిగిన పరిణామం రాజకీయ వర్గాల్లోనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె ఒకే గ్రామ పంచాయతీలో కీలక పదవులను దక్కించుకోవడం, అదీ భిన్న రాజకీయ సమీకరణల మధ్య జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.

వెంకిర్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన గొల్లపల్లి అలేఖ్య ఘన విజయం సాధించారు. యువతిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అలేఖ్యకు గ్రామంలో మంచి మద్దతు లభించింది. ఆమె విజయం సాధించడంతో వెంకిర్యాలలో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు ఆసక్తికర మలుపు ఉప సర్పంచ్ ఎన్నికల సమయంలో చోటుచేసుకుంది.

ఉప సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల మద్దతు సమానంగా చీలిపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థికి కొంతమంది మద్దతు పలకగా, కాంగ్రెస్ అభ్యర్థికి కూడా అంతే సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో ఓటింగ్ సమీకరణం సమానంగా మారింది. ఈ పరిస్థితిలో సర్పంచ్‌కు ఉన్న నిర్ణాయక ఓటు కీలకంగా మారింది. ఆ సమయంలో సర్పంచ్‌గా ఎన్నికైన అలేఖ్య తన ఓటును ఎవరికీ వేస్తారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో అలేఖ్య తన ఓటును బీఆర్ఎస్ మద్దతుతో ఉప సర్పంచ్ పదవికి పోటీ చేసిన తన తండ్రి గొల్లపల్లి పర్శయ్యకు వేయడం రాజకీయంగా ఆసక్తికర మలుపు ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గొల్లపల్లి పర్శయ్య ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఫలితంగా వెంకిర్యాల గ్రామ పంచాయతీలో సర్పంచ్‌గా కుమార్తె, ఉప సర్పంచ్‌గా తండ్రి బాధ్యతలు చేపట్టడం విశేషంగా నిలిచింది.

ఒకవైపు బీజేపీ మద్దతుతో కుమార్తె సర్పంచ్‌గా గెలవడం, మరోవైపు బీఆర్ఎస్ మద్దతుతో తండ్రి ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావడం గ్రామ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. భిన్న రాజకీయ పార్టీల మద్దతుతో ఒకే కుటుంబం కీలక పదవుల్లోకి రావడం అరుదైన సంఘటనగా స్థానికులు పేర్కొంటున్నారు. ఇది రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయమా, కుటుంబ ఐక్యతకు ఇచ్చిన ప్రాధాన్యమా అన్న చర్చ కూడా గ్రామంలో సాగుతోంది.

ఈ పరిణామంతో వెంకిర్యాల గ్రామ పంచాయతీ పాలన ఎలా కొనసాగుతుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. తండ్రి, కుమార్తె ఇద్దరూ కలిసి గ్రామ అభివృద్ధికి పని చేస్తామని, రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెబుతున్నారు. గ్రామ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఐక్యతతో పనిచేస్తామని వారు ప్రకటించడం గమనార్హం. మొత్తానికి రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో చోటుచేసుకున్న ఈ ఘటన తెలంగాణ గ్రామీణ రాజకీయాలకు కొత్త చర్చకు తెరతీసింది.

ALSO READ: GOOD NEWS: వారి ఖాతాల్లో డబ్బులు జమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button