Kim Jong Un’s Daughter: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్ జు యేకు ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతోంది. గత మూడేళ్లుగా తండ్రి కిమ్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కిమ్ జు యేకు త్వరలో కిమ్ అధికార పగ్గాలు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమెను కిమ్ వారసురాలిగా స్థానిక మీడియా వార్తా కథనాలు ప్రసారం చేస్తోంది.
తాజాగా కిమ్ జు యే తాజాగా మరోసారి బహిరంగంగా కనిపించారు. తన తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశం కుమ్సుసన్ స్మారకాన్ని ఆమె సందర్శించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దేశ మాజీ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్గా మారాయి.
కిమ్ కు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు
2009లో రి సోల్ జుతో కిమ్కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే, ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు యే గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. ఆమె కిమ్కు చాలా ఇష్టమట.
2022లో తొలిసారి జుయేని కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి తండ్రితోపాటూ పలు అధికారిక కార్యక్రమాల్లో జుయే మెరిశారు. ఇటీవలే ఆమెను తొలిసారి విదేశీ పర్యటనకు కూడా తీసుకెళ్లారు కిమ్. గతేడాది సెప్టెంబర్ 2న చైనా పర్యటనకు తీసుకెళ్లారు. చైనా విజయోత్సవాల సందర్భంగా జరిగిన సైనిక కవాతుకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఇలాంటి హై ప్రొఫైల్ ఈవెంట్లో ఆమె పాల్గొనడాన్ని బట్టి కిమ్ జోంగ్ ఉన్కు భావి వారసురాలిగా ఆమెను పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.





