
Kodandaram About KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ఎంక్వయిరీకి హాజరు కావడం పట్ల ఎమ్మెల్సీ కోదండరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. ప్రజా ధనాన్ని ఇష్టారీతిన ఖర్చు చేయడం వల్లే కేసీఆర్ ఈ రోజున పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ కమిషన్ ముందుకు రావడాన్ని కొంత మంది తప్పుబడుతున్నారని చెప్పిన కోదండరామ్, ఈ అంశంపై రాద్దాంతం అవసరం లేదన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంలో ఎలాంటి అవకతవకలు జరగనప్పుడు, విచారణకు హాజరైతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు.
తప్పు చేస్తే చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందే!
ప్రభుత్వంలో ఉండి తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైన చట్టం ముందు నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు కోదండరామ్. కేసీఆర్ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పోసి నిర్మించన కాళేశ్వరం కూలిపోయి, రాష్ట్ర ప్రజలకు అప్పులు మిగిలాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విచారణలో కేసీఆర్ నిజాలు చెప్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను వింటుందన్న కోదండరామ్, కేసీఆర్ పాలనలో అలాంటి అవకాశమే ఉండేది కాదన్నారు. ప్రగతి భవన్ లోకి కనీసం మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదన్నారు. ఆయనో రాజుల వ్యవహరించారని విమర్శించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశం
తాజాగా నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఎగురవేశారు. ప్రొఫెసర్ జయంశంకర్ తో పాటు అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వచ్చే రోజుల్లో తెలంగాణ జనసమితిని మరింత బలోపేతం చేయాలని పార్టీ నాయకులకు కోదండరామ్ సూచించారు.