Nirmala Sitaraman: విద్యార్థులతో సమావేశం కానున్న ఆర్థిక మంత్రి.. ఎందుకో తెలుసా?

Nirmala Sitaraman: దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ప్రవేశం వేళ అరుదైన, వినూత్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Nirmala Sitaraman: దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ప్రవేశం వేళ అరుదైన, వినూత్న కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ కీలక సందర్భాన్ని విద్యార్థులకు మరింత దగ్గర చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల నుంచి 30 మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది కేంద్రం. బడ్జెట్ అనేది కేవలం సంఖ్యలు, ఖర్చుల ప్రకటన మాత్రమే కాదని, పాలన, విధాన రూపకల్పనలో యువతకు అవగాహన పెంచాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఎంపికైన 30 మంది విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీలో కూర్చొని ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షించారు. పార్లమెంట్ వేదికగా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆర్థిక నిర్ణయాలు ఎలా ప్రకటించబడతాయో దగ్గర నుంచి చూడే అవకాశం వారికి లభించింది. బడ్జెట్ ప్రసంగం అనంతరం ఈ విద్యార్థులు కర్తవ్య భవన్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను సందర్శించనున్నారు. అక్కడ ఆర్థిక శాఖ పని తీరును, విధానాల రూపకల్పన ఎలా జరుగుతుంది, ఉన్నత స్థాయిలో తీసుకునే నిర్ణయాలు ఎలా అమలవుతాయన్న అంశాలపై ప్రత్యక్ష అవగాహన పొందనున్నారు.

ఇదే కార్యక్రమంలో భాగంగా కాసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులను స్వయంగా కలవనున్నారు. బడ్జెట్ రూపకల్పన వెనుక ఉన్న ఆలోచనలు, ఆర్థిక సవాళ్లు, భవిష్యత్ లక్ష్యాలపై ఆమె విద్యార్థులతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే బడ్జెట్‌పై విద్యార్థుల అభిప్రాయాలు, సూచనలను కూడా ఆమె తెలుసుకోనున్నారు. ఇది కేవలం ఒక పరస్పర సమావేశంగా కాకుండా, యువత ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చే ప్రయత్నంగా కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

పరిపాలన, ఆర్థిక విధానాల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో పాలనలో కీలక పాత్ర పోషించబోయే యువతకు ఇప్పటి నుంచే ఆర్థిక నిర్ణయాలపై అవగాహన కల్పించడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ఇందులో దాగి ఉంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, కేంద్ర బడ్జెట్‌పై సమాజంలో మరింత అవగాహన పెంచే దిశగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: బడ్జెట్‌ను ఫిబ్రవరి 1నే ఎందుకు ప్రవేశపెడతారో తెలుసా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button