జాతీయం

కొత్త రూల్స్.. 8 గంటలు దాటితే ‘NO REFUND’

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అత్యాధునిక డిజైన్, అధిక వేగం, భద్రత, లగ్జరీ సౌకర్యాలతో ఈ రైళ్లను ప్రీమియం విభాగంగా అభివృద్ధి చేశారు. అయితే, ఈ రైళ్లలో ప్రయాణం చేయాలనుకునే వారికి టికెట్ రద్దు నిబంధనలు మాత్రం ఊహించని షాక్ ఇస్తున్నాయి. ఇటీవల రైల్వే బోర్డు ప్రకటించిన కొత్త మార్గదర్శకాలు, సాధారణ రైళ్లతో పోలిస్తే మరింత కఠినంగా ఉండటంతో ప్రయాణికుల్లో ఆందోళన మొదలైంది.

కొత్త నిబంధనల ప్రకారం వందే భారత్ స్లీపర్ రైలులో ధృవీకరించిన టికెట్‌ను ఏ సమయంలో రద్దు చేసినా తప్పనిసరిగా 25 శాతం మొత్తం కట్ అవుతుంది. ప్రయాణ తేదీ చాలా రోజుల తర్వాత ఉన్నా కూడా పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉండదు. ఇది సాధారణ రైళ్లలో అమలులో ఉన్న రీఫండ్ విధానానికి పూర్తిగా భిన్నంగా ఉండటం గమనార్హం. సాధారణంగా ముందుగానే టికెట్ రద్దు చేస్తే ప్రయాణికులకు ఎక్కువ మొత్తం తిరిగి వస్తుంది. కానీ వందే భారత్ స్లీపర్‌లో ఆ వెసులుబాటు లేదు.

ఇక రైలు బయలుదేరే సమయానికి 72 గంటల నుంచి 8 గంటల మధ్య టికెట్ రద్దు చేస్తే, టికెట్ మొత్తంలో 50 శాతం క్యాన్సిలేషన్ ఛార్జీ విధిస్తారు. అంటే, సగం మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. ప్రయాణికులకు మరింత కీలకమైన విషయం ఏమిటంటే.. రైలు బయలుదేరే ఎనిమిది గంటల లోపు టికెట్ రద్దు చేస్తే ఒక్క రూపాయి కూడా రీఫండ్ ఉండదు. గతంలో చాలా రైళ్లకు ఉన్న 4 గంటల గడువు స్థానంలో, వందే భారత్ స్లీపర్ రైళ్లకు ప్రత్యేకంగా 8 గంటల పరిమితిని రైల్వే శాఖ ఖరారు చేసింది.

ఈ కఠిన నిర్ణయానికి కారణం కూడా అధికారులు వెల్లడించారు. వందే భారత్ స్లీపర్ రైళ్లకు బయలుదేరే ఎనిమిది గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ లేదా RAC సౌకర్యం ఉండదు. కేవలం ధృవీకరించిన టికెట్లనే జారీ చేస్తారు. దీంతో ఒక టికెట్ రద్దయినా, దానిని వెంటనే మరొక ప్రయాణికుడికి కేటాయించే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని అధికారులు వివరించారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలోనే రద్దు సమయాన్ని కుదించడం, రీఫండ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సి వచ్చిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే నడుస్తున్న వందే భారత్ చైర్‌కార్ రైళ్లకు లేదా సాధారణ ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు వర్తించే నియమాలకు ఇవి పూర్తిగా భిన్నమని అధికారులు పేర్కొంటున్నారు.

సాధారణ రైళ్లలో బయలుదేరే 48 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు. అలాగే 48 నుంచి 12 గంటల మధ్య రద్దు చేస్తే 25 శాతం, 12 నుంచి 4 గంటల మధ్య రద్దు చేస్తే 50 శాతం ఛార్జీ ఉంటుంది. నాలుగు గంటల లోపు రద్దు చేస్తే మాత్రమే రీఫండ్ ఉండదు. కానీ వందే భారత్ స్లీపర్ రైళ్లలో ఈ వెసులుబాట్లేవీ లేవు.

ఇక ఈ రైళ్లకు కనీస ఛార్జీ వర్తించే దూరాన్ని 400 కిలోమీటర్లుగా నిర్ణయించారు. మహిళలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, డ్యూటీ పాస్ కలిగిన వారికి మాత్రమే ప్రత్యేక కోటాలు వర్తిస్తాయి. ఇతర సాధారణ కోటాలను ఈ ప్రీమియం రైళ్లలో అమలు చేయడం లేదు.

మొత్తంగా చూసుకుంటే.. వందే భారత్ స్లీపర్ రైళ్లు సౌకర్యాలు, వేగం, భద్రత పరంగా అత్యాధునికంగా ఉన్నప్పటికీ, టికెట్ రద్దు విషయంలో మాత్రం ప్రయాణికులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రైల్వే నిపుణులు సూచిస్తున్నారు. టికెట్ బుక్ చేసుకునే ముందు ప్రయాణ ప్రణాళికను ఖరారు చేసుకోవడం, అనవసర రద్దులను నివారించడం ద్వారానే ఈ ప్రీమియం రైలులో ఆర్థిక నష్టాన్ని తప్పించుకోవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: నిద్రకు ముందు ఈ ఒక్క జాగ్రత్త చాలు.. జీవితాంతం మెడ, వెన్నునొప్పులు దూరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button