
Asaduddin Owaisi: ఆసియా కప్-2025లో భారత్- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశంతో క్రికెట్ మ్యాచ్ ఆడటం తన అంతరాత్మ ఒప్పుకోదన్నారు. రక్తం-నీళ్లు కలిసి ప్రవహించలేవని చెప్పిన మనం, ఆ దేశంతో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతామని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు.
భారత్-పాక్ మ్యాచ్ ను వ్యతిరేకిస్తున్నా!
భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ ను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేనని ఒవైసీ తేల్చి చెప్పారు. “ రక్తం, నీళ్లు కలిసి ప్రవహించలేవని మనం ప్రకటించాం. అలాంటప్పుడు పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడుతారు? పాక్ విమానాలు మన గగనతలంలోకి రావు. వారి పడవలు మన ప్రాదేశిక జలాల్లోకి రావు. పాక్ తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేశాం. అలాంటి దేశంతో క్రికెట్ మ్యాచ్ ఎలా ఆడతాం?’’ అని ప్రశ్నించారు. ఒకవేళ ఈ మ్యాచ్ జరిగినా.. దాన్ని చూసేందుకు నా అంతరాత్మ అంగీకరించదు” అని ఒవైసీ వెల్లడించారు. ఆసియా కప్ -2025 షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబరు 14న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారత్ పై ఉగ్రదాడులు చేస్తున్న పాక్ తో మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదంటున్నారు. త్వరలోనే ఈ మ్యాచ్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.
Read Also: బీహార్ ఎన్నికలు.. ఈసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!