Tuesday, March 3, 2026
HomeజాతీయంMunnar Elections: నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అధ్యర్థిగా సోనియా గాంధీ పోటీ!

Munnar Elections: నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అధ్యర్థిగా సోనియా గాంధీ పోటీ!

Munnar Elections: కేరళలోని ఇడుక్కి జిల్లా రాజకీయ వాతావరణం ప్రస్తుతం ఒక చిన్న వార్డు నుంచే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం ఆధారంగా సాగుతుంటాయి. కానీ మూన్నారు నగర పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఒక విశేష సంఘటన ఇప్పుడు ప్రజలలోనే కాదు.. రాజకీయ పార్టీల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కారణం ఒక అసాధారణమైన పేరు రాజకీయ రంగంలో ప్రత్యర్థులకు సమస్యగా మారడమే.

నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన దివంగత దురైరాజ్ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ కార్యకర్త. ఆయనకు జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీపై ఎంతో గౌరవం, అభిమానం ఉండేది. ఆ అభిమానాన్ని మరింత బలపరచాలనే ఉద్దేశంతో ఆయన తన కుమార్తెకు సోనియా గాంధీ అనే పేరును పెట్టాడు. కుటుంబ సభ్యులందరూ ఈ పేరును గర్వంతో స్వీకరించారు. ఆమె కూడా చదువుల్లో ప్రతిభ కనబరచి ఉన్నత విద్య పూర్తి చేసింది. అనంతరం కుటుంబ అనుమతితో సుభాష్ అనే యువకుడితో ఆమె వివాహం జరిగింది.

ఇక్కడ నుంచే రాజకీయ దిశ పూర్తిగా మారిపోయింది. సుభాష్ చిన్నతనం నుంచే బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటూ ఆ పార్టీలో చురుకుగా పనిచేసేవాడు. విద్యార్థిదశలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టి అనంతరం పంచాయతీ జనరల్ సెక్రటరీగా కూడా ఎంపికయ్యాడు. పెళ్లి తర్వాత కుటుంబ వాతావరణం, భర్త రాజకీయ దృ‍క్కోణం, ఆలోచనల ప్రభావం సోనియా గాంధీపైనా పడింది. భర్త ప్రోత్సాహంతో ఆమె కూడా రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకుంది. ఇక చివరకు బీజేపీలో చేరి ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో కమలం గుర్తుపై అధికారిక అభ్యర్థిగా బరిలో నిలిచింది.

ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కారణం, వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంజులా రమేష్ ప్రజలకు పరిచయమున్న వ్యక్తే అయినప్పటికీ, ప్రత్యర్థి అభ్యర్థి పేరు సోనియా గాంధీ కావడంతో ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. చాలా మంది ఓటర్లు ఓటు చిహ్నం కంటే అభ్యర్థి పేరును మాత్రమే చదివి ఓటు వేయడం సాధారణం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదువు తక్కువగా ఉన్న ఓటర్లు పేరు చూసి నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ అనే పేరు కనిపిస్తే ఆ ఓట్లు స్వయంగా కాంగ్రెస్‌కు వస్తాయని అనుకునే ప్రజల్లో తప్పుదారి పడే అవకాశం ఉంది. ఇదే భయం ఇప్పుడు స్థానిక కాంగ్రెస్ నాయకులలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజలు అభ్యర్థి పేరును కాంగ్రెస్ నేత సోనియా గాంధీతో పోల్చి దోషపూరితంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. పేరు మాత్రమే చదివి బీజేపీ అభ్యర్థికి అనుకోకుండా ఓట్లు పడిపోతే వార్డులో ఓటర్ల తీర్పు పూర్తిగా మలుపు తిరిగే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ నేతలు ఇళ్లకిండి ప్రచారంలో ప్రజలకు స్పష్టంగా వివరించే పనిలో పడ్డారు. అభ్యర్థి ఎవరు, ఏ పార్టీకి చెందినవారు, ఎలాంటి చిహ్నాన్ని చూసి ఓటు వేయాలి అనే విషయాలను ఒక్కొక్కరికి వెళ్లి చెప్పే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన ఒక పేరు రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపగలదో మరోసారి నిరూపిస్తోంది. కుటుంబ అభిమానం కారణంగా పెట్టిన పేరు ఇప్పుడు ప్రత్యర్థి పార్టీకే ప్రయోజనకరంగా మారడం రాజకీయాల్లో జరిగే ఆసక్తికర సంఘటనల్లో చోటు చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఏ దిశగా వెళుతాయన్నది చూడాలి కాని, సోనియా గాంధీ అనే పేరు మూన్నారు పంచాయతీలో ఈసారి తప్పనిసరిగా చర్చలో నిలుస్తుందనడంలో సందేహం లేదు.

ALSO READ: Health Care: ముఖం నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటున్నారా?

RELATED ARTICLES

Most Popular

Recent Comments