తెలంగాణ

ఒక్కో గ్రామంలో వందల నామినేషన్లు.. ఎమ్మెల్సీ కవిత బిగ్ స్కెచ్

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల వేడి కనిపిస్తోంది. రేపోమాపో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండగా.. బీసీ రిజర్వేషన్ల అంశం తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీ నినాదంతో జనంలోకి వెళుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కాక రేపుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే గ్రామ గ్రామాన వందలాది నామినేషన్లు వేపిస్తామని చెప్పారు. ప్రతీ వార్డులో, పంచాయతీల్లో వందలాది నామినేషన్లు దాఖలు చేయిస్తామన్నారు. ఢిల్లీకి వెళ్లే ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి గిన్నీస్ రికార్డు ఖాయమని సెటైర్లు వేసిన ఎమ్మెల్సీ కవిత.. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి బీసీ బిల్లుపై చర్చించలేదని ఆరోపించారు. మనస్ఫూర్తిగా బీసీ బిల్లు ఆమోదానికి రేవంత్ రెడ్డి కృషి చేయడం లేదని విమర్శించారు.

బీసీ బిల్లు కోసం తెలంగాణ వికసిత్ యాత్ర పేరిట బీజేపీ యాత్ర చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీ బిల్లుకు మద్ధతివ్వకుండా ఎన్ని యాత్రలు చేసినా బీజేపీని ప్రజలు నమ్మరని చెప్పారు. బీసీ బిల్లు కోసం జూలై 17న పెద్ద ఎత్తున రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. జూలై 16, 17, 18 తేదీల్లో ప్రయాణాలు పెట్టుకున్నవాళ్లు వాయిదా వేసుకోవాలని కవిత సూచించారు. రైల్ రోకో కార్యక్రమానికి ఆయా కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు వస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాలు కూడా తెలంగాణ జాగృతి ఉద్యమానికి మద్ధతిస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button