
తెలంగాణ బీజేపీలో లుకలుకలు పెరిగిపోయాయి. పార్టీలో సీనియర్లు- జూనియర్లుగా నేతలు విడిపోయారు. ఎవరి గ్రూప్ వారిదే. ఈ క్రమంలోనే కొత్తగా వలస లీడర్లతో మరో గ్రూప్ తయారైంది. ఈ గ్రూప్ పంచాయతీలు అన్ని ఒకవైపు.. వీరందర్ని కాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ది మరో గ్రూప్.. ఆయన పార్టీలో ఏక్ నిరంజన్.. నా దారి నాదే అన్నట్టుగా ఆయన వ్యవహారం నడిపిస్తుంటారు.. తాజాగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ పార్టీలో మరోసారి రచ్చ రాజేశాయి. దాంతో రాజాసింగ్పై మరోసారి వేటు పడబోతుందనే టాక్ వినిపిస్తోంది.
ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు బయకుపోవాలన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే..ఆ సీఎంను సీక్రెట్గా కలుస్తారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు రాజాసింగ్. అయితే రాజాసింగ్ కామెంట్స్పై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ను మరోసారి పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఎమ్మెల్యే రాజాసింగ్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఆయన ఏదీ మాట్లాడిన సంచలనమే అవుతోంది. గతంలెపై మత విద్వేశాలను రెచ్చగొట్టడంతో.. రాజాసింగ్ను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సస్పెన్షన్ను ఎత్తివేశారు. అనంతరం బీఆర్ఎస్ సర్కార్ హాయాంలో ఆయన్ను జైల్లో పెట్టారు. కానీ పార్టీ పెద్దలు కూడా పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలకు ముందు తిరిగి పార్టీలోకి తీసుకోవడంతో యాక్టివ్ అయ్యారు. గోషామహల్ సిట్టింగ్ సీటును రాజాసింగ్కే కట్టబెట్టారు. కానీ ఆయనలో మాత్రం మార్పు రావడం లేదు. బీజేపీని రాజాసింగ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న అసంతృప్తితోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని పార్టీ నేతలు అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది. రాష్ట్ర చీఫ్ పదవి రేసులో కనీసం సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును పార్టీ పెద్దలు పరిశీలించలేదట. ఆ కారణాంగానే రాజాసింగ్ సీనియర్లను టార్గెట్ చేశారని అంటున్నారు. రాజాసింగ్ డైలాగ్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్ను ఉద్దేశించి చేసినవే అంటున్నారు. తనకు పదవి దక్కకుండా చేసిన నేతలనే రాజాసింగ్ డైరెక్ట్గా టార్గెట్ చేయడంపై పార్టీలో లోతైన చర్చ జరుగుతుందట. రాజాసింగ్ కామెంట్స్ ను పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారని తెలుస్తోంది.