
Mega Star: మెగాస్టార్ చిరంజీవి ప్రజల సేవ కోసం ఎంతోకాలంగా అంకితభావంతో నడిపిస్తున్న చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ప్రజలకు అవసరమైన సమయంలో రక్తం, కళ్ళు అందించే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్లను స్థాపించి అనేక మంది ప్రాణాలను కాపాడుతోంది. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరింత శక్తినిచ్చేలా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ ట్రస్ట్ భారతదేశం లోపల మాత్రమే కాకుండా విదేశాల్లో నివసించే దాతల నుండి కూడా విరాళాలు స్వీకరించడానికి అధికారిక అనుమతి పొందింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్వయంగా ధృవీకరించారు.
ఇటీవలి కాలంలో కేంద్రం విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 (FCRA) కింద కొన్ని కీలక మార్పులు చేస్తూ, విదేశీ విరాళాలు స్వీకరించాలనుకునే ఏ సంస్థ అయినా తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ హోం మంత్రి అమిత్ షాకు అధికారిక లేఖ రాసి అనుమతి కోరింది. ట్రస్ట్ సేవల స్వచ్ఛతను, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పరిశీలించిన కేంద్రం, ఈ సంస్థకు విదేశీ విరాళాలు స్వీకరించేందుకు అనుమతి మంజూరు చేసింది.
ఈ నిర్ణయం ద్వారా ట్రస్ట్ కార్యకలాపాలు మరింత విస్తరించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడ దాతలు తమ సహాయాన్ని అందించగలిగే అవకాశం కలుగుతుంది. ఇది చిరంజీవి సేవా కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రజల ఆరోగ్యం, అండదండలు, అత్యవసర పరిస్థితుల్లో సేవలందించే ఈ ట్రస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినట్టే. ఈ అనుమతి ద్వారా వేలాది మంది ప్రాణాలకు మరింత ఆశ కనబడనుంది.
ALSO READ: Chahal: పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి





