Married Man Living with Woman Not Illegal: సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ఇప్పటికే వివాహం అయిన ఒక పురుషుడు, మరో మహిళతో ఆమె సమ్మతితో కలిసి జీవించడం నేరం కాదని స్పష్టం చేసింది. నైతిక విలువలు, చట్టపరమైన అంశాలు రెండూ వేర్వేరని కోర్టు పేర్కొంది. పౌరుల హక్కులను కాపాడటం న్యాయస్థానాల బాధ్యత కాగా, సమాజ నైతికత ఆధారంగా వాటిని పరిమితం చేయలేమని కూడా స్పష్టం చేసింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఈ కేసు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ పూర్ ప్రాంతానికి చెందిన ఒక జంటకు సంబంధించినది. ఆ వ్యక్తి ఇప్పటికే పెళ్లి అయినప్పటికీ, మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ సంబంధాన్ని వ్యతిరేకించిన ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జంటపై కేసు నమోదు చేయించడంతో పాటు, వారిని బెదిరిస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఆ జంట హైకోర్టును ఆశ్రయించింది. తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని, మహిళ కుటుంబ సభ్యులు తమను హత్య చేస్తామని బెదిరిస్తున్నారని కోర్టుకు తెలిపారు.విచారణ సందర్భంగా ఆ మహిళ కోర్టు ఎదుట తన వాంగ్మూలం ఇచ్చింది. తాను మేజర్నని, తన ఇష్టపూర్వకంగానే ఆ వ్యక్తితో కలిసి జీవిస్తున్నానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు పెద్దవారు పరస్పర సమ్మతితో సహజీవనం చేస్తే, దాన్ని నేరంగా పరిగణించడం సరైంది కాదని తెలిపింది.
భద్రత కల్పించాలని పోలీసులకు ఆదేశం
అంతేకాకుండా, ఆ జంటకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ తీర్పుతో సహజీవనంపై చట్టపరమైన స్పష్టత మరింత పెరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత నిర్ణయాలకు చట్టం రక్షణ కల్పిస్తుందనే సందేశాన్ని కోర్టు మరోసారి వెల్లడించింది.
