తెలంగాణరాజకీయంవైరల్

Local Elections: వామ్మొ!.. సర్పంచ్ పదవికి MLA స్థాయి హామీలు

Local Elections: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల కదలికలు ఇవాళ ప్రతి ఊరినీ కొత్త ఉత్సాహంతో నింపుతున్నాయి.

Local Elections: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల కదలికలు ఇవాళ ప్రతి ఊరినీ కొత్త ఉత్సాహంతో నింపుతున్నాయి. నామినేషన్ల దశ ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు తమ తమ బలగాలతో ప్రజల మధ్యకు వెళ్లి మద్దతు కోరుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సహజంగా కనిపించే పోటీ ఈసారి మరింత ఉధృతంగా మారింది. ముఖ్యంగా సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల హామీలు చూసి ప్రజల్లో ఆశ్చర్యం, ఆలోచన, కొంత సందేహం కలిసిన ప్రతిస్పందన కనిపిస్తోంది. గెలుపు కోసం ఎలాంటి ఖర్చుకైనా వెనకాడకుండా ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు.. ఎమ్మెల్యేలకే సాటి స్థాయి హామీలు ప్రకటిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన పసుల వనమ్మ నరసింహ యాదవ్ అనే సర్పంచ్ అభ్యర్థి ప్రకటించిన హామీలు చూస్తే, ఆమె పోటీ చేస్తున్నది సాధారణ సర్పంచ్ పదవికేనా లేక ఒక పెద్ద నియోజకవర్గ అభివృద్ధికా అనే సందేహం కలగక మానదు. గ్రామంలోని ప్రతి ఇంటికీ రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని ఆమె ప్రకటించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామంలో 700 ఇళ్లు ఉండటంతో సంవత్సరానికి చెల్లించాల్సిన బీమా ప్రీమియం మాత్రమే రూ.8.40 లక్షలు అవుతుంది. ఐదు సంవత్సరాలకు ఇది రూ.42 లక్షలకు పైగా అవుతుంది. ఈ ఒక హామీనే ఎంత భారంగా ఉంటుందో అర్ధమవుతోంది.

కేవలం అంతే కాదు, వనమ్మ మొత్తం 15 ప్రత్యేక హామీలతో తన మేనిఫెస్టోను విడుదల చేసింది. గ్రామంలో ఆడపిల్ల పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని చెప్పింది. ఆడపిల్ల పెళ్లిలో పుస్తెమట్టెలు అందిస్తానని, అబ్బాయి వివాహానికి రూ.5,116 సహాయం అందిస్తానని ప్రకటించింది. నెలకోసారి మెడికల్ క్యాంప్ నిర్వహణ, ఆపరేషన్ అవసరమైనవారికి రూ.15 వేల సాయం, ఇల్లు కట్టుకునే సమయంలో స్లాబ్ వేసుకునేందుకు రూ.21వేల ఆర్థిక సహాయం వంటి పథకాలను కూడా మేనిఫెస్టోలో చేర్చింది.

విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, షూలు, నోట్‌బుక్స్ ఇచ్చే పథకం, ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం, గ్రామ గ్రంథాలయ ఏర్పాటుతో పాటు శ్రీరామనవమి, శివరాత్రి, రంజాన్ వంటి పండుగల సమయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలిపింది. రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హామీలు కూడా ఉన్నాయి. అలాగే ఇంట్లో ఎవరు మరణించినా వారి దహన సంస్కారాలకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తానని, అంత్యక్రియలకు అవసరమైన వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది.

వనమ్మ ఇలా చేసిన హామీలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం చూసి కొందరు ఎమ్మెల్యేలే ఇంతలా వాగ్దానాలు చేయరని విమర్శిస్తుండగా, మరికొందరు ఇవన్నీ అమలు చేయగలిగే హామీలేనా లేక గెలిచాక మాయమవుతారా అని ప్రశ్నిస్తున్నారు.

అదే సమయంలో తెలంగాణలో మరో గ్రామమైన గద్వాల జిల్లా సల్కాపురంలో ఆంజనేయులు అనే మరో అభ్యర్థి తన మేనిఫెస్టోను రూ.100 బాండ్ పేపర్ మీద రాసి ప్రజలకు అందించారు. మొత్తం 22 హామీలతో కూడిన ఈ మేనిఫెస్టోలో గ్రామానికి అంబులెన్స్ ఏర్పాటుచేయడం, బైక్ స్కూటీ ఉన్న వారికి ఉచిత హెల్మెట్ పంపిణీ, వితంతువులకు ఇల్లు నిర్మాణానికి రూ.10 వేల సాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి విషయాలను ప్రకటించారు. బీసీ స్మశానవాటికకు ఫెన్సింగ్, బోరు, మోటార్ ఏర్పాటు చేసి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని, సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం చేపడతానని కూడా హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చలేకపోతే స్వయంగా సర్పంచ్ పదవి నుంచి తప్పుకుంటానని బాండ్ పేపర్ మీదే రాసి ఇచ్చిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ రెండు సందర్భాలు చూస్తే, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇక సాధారణ స్థానిక ఎన్నికలు మాత్రమే కాకుండా ప్రజల మనసు గెలుచుకోవడానికి హామీల యుద్ధంగా మారిపోయినట్టు అనిపించక మానదు. హామీలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, అవి అమలు చేసే సామర్థ్యం ఉందా అనే ప్రశ్న ఇప్పుడు ఓటర్ల ముందుంది.

ALSO READ: SHOCKING: వైసీపీ నేత రాసలీలలు.. వీడియో వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button