జాతీయంసినిమా

‘బతకండి.. బతకనీయండి’: విజయ్ దేవరకొండ

సినీ పరిశ్రమను ఇటీవలి కాలంలో తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ రివ్యూస్‌. కథ, దర్శకత్వం, నటన, సాంకేతిక ప్రమాణాలు అన్నీ బాగున్నప్పటికీ, కొందరు కావాలనే ఇచ్చే నెగిటివ్ రివ్యూస్ సినిమాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

సినీ పరిశ్రమను ఇటీవలి కాలంలో తీవ్రంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ రివ్యూస్‌. కథ, దర్శకత్వం, నటన, సాంకేతిక ప్రమాణాలు అన్నీ బాగున్నప్పటికీ, కొందరు కావాలనే ఇచ్చే నెగిటివ్ రివ్యూస్ సినిమాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదలైన తొలి గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా ఫేక్ రివ్యూస్ షేర్ చేస్తూ, సినిమా హిట్ లేదా ఫ్లాప్ అన్న తీర్పును ముందే ప్రకటించే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రేక్షకుల్లో తప్పుదారి పట్టించే వాతావరణం ఏర్పడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఫేక్ రివ్యూస్ ప్రభావం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, బుక్ మై షో వంటి ప్రముఖ టికెట్ బుకింగ్ వెబ్‌సైట్ల వరకూ విస్తరించింది. సినిమా విడుదలైన వెంటనే అక్కడ నెగిటివ్ రేటింగ్స్, తప్పుడు రివ్యూస్ వెల్లువలా వస్తుండటంతో, ప్రేక్షకుల నిర్ణయాలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో మన శంకరవరప్రసాద్ గారు సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు బుక్ మై షోలో నెగిటివ్ రేటింగ్స్ మరియు రివ్యూస్ ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నిర్ణయం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

ఈ అంశంపై స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితంగా స్పందించారు. కోర్టు నిర్ణయం తనకు ఒకవైపు సంతోషాన్ని కలిగించిందని, మరోవైపు బాధను కూడా కలిగించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో ఎంతోమంది నిర్మాతలు, దర్శకులు, కళాకారుల కష్టం, కలలు, పెట్టుబడులను కొంతవరకు కాపాడుకునే అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, ఈ సమస్యకు కారణమవుతున్నవారు మన సినీ పరిశ్రమకు చెందినవారే కావడం బాధాకరమని తెలిపారు.

బతకండి బతకనీయండి అనే భావన ఎక్కడికి పోయిందని విజయ్ దేవరకొండ ప్రశ్నించారు. అందరూ కలిసి ఎదగాలనే ఆలోచన మరిచిపోయామా అని ఆవేదన వ్యక్తం చేశారు. తన డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో వ్యవస్థీకృతంగా జరిగిన నెగిటివ్ ప్రచారాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను ఈ విషయంపై మాట్లాడిన ప్రతిసారీ స్పందన లేకుండా పోయిందని, మంచి సినిమా అయితే ఎవ్వరూ ఆపలేరని చెప్పి అందరూ ఊరించారని పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో తనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు మాత్రం ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నారని తెలిపారు.

ఫేక్ రివ్యూస్ వెనుక కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్లు విజయ్ దేవరకొండ వెల్లడించారు. తన కలలను, తనతో కలిసి పని చేసిన వారి శ్రమను కాపాడుకునేందుకు ఎలా పోరాడాలా అని ఆలోచించిన రోజులను గుర్తు చేసుకున్నారు. చివరకు ఈ సమస్యపై కోర్టు దృష్టి పడటం, బహిరంగంగా చర్చకు రావడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు.

చిరంజీవి వంటి అగ్ర హీరో సినిమాకే ఇలాంటి ముప్పు ఉందని కోర్టు గుర్తించడం ఈ సమస్య తీవ్రతను చూపిస్తోందని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే ఈ చర్యతోనే సమస్య పూర్తిగా పరిష్కారమవదని, కానీ కొంతవరకు ఉపశమనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. శంకరవరప్రసాద్ సినిమా సహా సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

విజయ్ దేవరకొండ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినీ పరిశ్రమలో ఫేక్ రివ్యూస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మరింత బలపడుతోంది. ప్రేక్షకులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిజమైన అభిప్రాయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Big shock: లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించి.. పాడు పని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button