
Thalliki Vandanam Scheme: ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన ‘తల్లికి వందనం’ స్కీమ్ నేటి నుంచి అమలు కాబోతోంది. ఈ మేరకు కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ముఖ్యమైన పథకాన్ని అమలు చేయబోతోంది. ‘తల్లికి వందనం’ పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు జమచేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును అందించనుంది. ఇప్పటికే ఇందుకు అవసరం అయిన రూ.8,745 కోట్లను సర్కారు రిలీజ్ చేసింది. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలోకి ఏడాదికి రూ. 15,000 జమ చేయనుంది.
‘తల్లికి వందనం’పై సీఎం చంద్రబాబు సమీక్ష
ఇవాళ్టి నుంచి ‘తల్లికి వందనం’ పథకం అమలు కానున్న నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ తో పాటు అధికారులు ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలోకి పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు నిధుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఈ అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ క్లాస్ లో చేరే విద్యార్థి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థుల వరకు ఈ స్కీమ్ అమలు కావాలన్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే, వారి తల్లుల ఖాతాల్లోకి నిధులు జమకానున్నాయి. ఏవైనా టెక్నికల్ సమస్యలతో లబ్దిదారుల లిస్టులో పేరు రాకపోయినా భయపడాల్సిన పని లేదన్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం అమలు చేస్తామన్నారు సీఎం చంద్రాబాబు.
భారీగా పెరిగిన లబ్దిదారుల సంఖ్య
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ‘అమ్మ ఒడి’ అనే పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా నేరుగా తల్లుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేశారు. అయితే, గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని పొందిన లబ్దిదారులతో పోల్చితే ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగింది. 2022-23 ఏడాదికి గాను 42,61,965 మంది తల్లులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఇందుకోసం రూ.6,392.94 కోట్లు అందించారు. ఇప్పుడు లబ్దిదారుల సంఖ్య 67,27,164కి చేరింది. గతంతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్య 24,65,199కి పెరిగింది. నిధుల వ్యయం రూ.2,352.06 కోట్లు పెరిగినట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Read Also: లోకల్ కాదు… నేషనల్ లెవెల్ లో ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆంధ్ర సీఎం!..