Middle East Crisis: అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతుండగా, మరోవైపు యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్కు కీలకమైన ఖార్గ్ దీవి ప్రస్తుతం ఈ వివాదానికి కేంద్రంగా మారింది.
ఖార్గ్ దీవిపై అమెరికా కన్ను
ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో సుమారు 2 వేల మంది సైనికులతో 82వ ఎయిర్ బార్న్ డివిజన్ను సిద్ధంగా ఉంచినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. యుఎస్ఎస్ ట్రిపోలి సహా పలు యుద్ధ నౌకలు, వేలాది మెరైన్ సైనికులను పశ్చిమాసియాకు తరలించారు. అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక దీవిని ఆక్రమించే కుట్ర చేస్తున్నాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఆరోపించారు. ఆ ప్రయత్నం జరిగితే తీవ్ర ప్రతీకారం తప్పదని హెచ్చరించారు. అదే సమయంలో ఖార్గ్ దీవి రక్షణ కోసం ఇరాన్ ముందస్తు చర్యలు తీసుకుంటూ, తీర ప్రాంతాల్లో మైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
‘అల్ మందాబ్’నూ మూసేస్తామని ఇరాన్ వార్నింగ్
ఖార్గ్ దీవిని టచ్ చేస్తే ‘అల్ మందాబ్’నూ మూసేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్హెచ్చరించింది. ఇది ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు రవాణాలో సుమారు 12% జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో యెమెన్లోని హౌతీ గ్రూప్ కూడా ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశముంది. అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలు యుద్ధం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం పెరుగుతుందా? అనే ఆందోళనలను పెంచుతున్నాయి.
