Khachandra Singh: భారత హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాలేయ సంబంధిత వ్యాధి చివరి దశకు చేరుకోవడంతో పరిస్థితి మరింత విషమించిందని తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉన్న యథార్థ్ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి ప్రాణాలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ చివరికి ఫలితం లేకుండాపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 2026 టీ20 ప్రపంచ కప్ పోటీల్లో రింకూ సింగ్ భారత జట్టు సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న సమాచారం అందుకున్న వెంటనే ఆయన చెన్నైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ అనంతరం జట్టును విడిచి హుటాహుటిన స్వగ్రామానికి బయలుదేరినట్లు తెలిసింది. టోర్నీలో మిగిలిన మ్యాచ్లకు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. జట్టు యాజమాన్యం పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.
రింకూ సింగ్ ఎదుగుదల వెనుక ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ కృషి ఎంతో కీలకమైంది. సాధారణ కార్మికుడిగా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే పనిలో నిమగ్నమై కుటుంబాన్ని పోషించిన ఖచంద్ర సింగ్ తన కుమారుడి కలలను నిజం చేయాలనే సంకల్పంతో ఎన్నో కష్టాలు భరించారు. ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సవాళ్లు ఎదురైనా కుమారుడి ఆటపై నమ్మకం కోల్పోలేదు. చిన్ననాటి నుంచి క్రీడాపట్ల ఆసక్తి చూపిన రింకూ సింగ్కు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ఆయన సాధ్యమైనంత సహాయం చేశారు. తన విజయాల వెనుక తండ్రి పాత్ర అపారమని రింకూ సింగ్ అనేక సందర్భాల్లో భావోద్వేగంగా ప్రస్తావించారు. కష్టపడి పనిచేసే తండ్రి తనకు స్ఫూర్తి అని చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానుల మనసులను కలచివేస్తున్నాయి.
ఈ విషయం తెలిసిన వెంటనే పలువురు క్రీడాకారులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాల్లో రింకూ సింగ్కు ధైర్యం చెప్పుతూ సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబానికి ఈ క్లిష్ట సమయంలో మానసిక ధైర్యం కలగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి దేశ స్థాయిలో గుర్తింపు పొందిన రింకూ సింగ్ జీవిత ప్రయాణంలో ఆయన తండ్రి చేసిన త్యాగాలు మరవలేనివి అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషాదం మధ్య రింకూ సింగ్ ధైర్యంగా నిలబడి తిరిగి జట్టులో చేరతాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: ఉగాదిలోపే వారికి ఇందిరమ్మ ఇళ్లు!
