తెలంగాణ

కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్, ఏం చెప్పబోతున్నారంటే?

KCR- Kaleshwaram Commission Inquiry: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం కమిషన్‌ ముందుకు రానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఇంత కాలం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు మాజీ మంత్రులను ప్రశ్నించిన కమిటీ, ఇవాళ కేసీఆర్ ను విచారించనుంది. కేసీఆర్ వివరణతో కమిషన్ విచారణ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కమిషన్ ముందు కేసీఆర్ ఏ విషయాలు చెప్తారు? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఈటెల, హరీష్ వాగ్మూలం ఆధారంగా ప్రశ్నలు!

తాజాగా మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు ఘోష్ కమిషన్ ముందు హాజరై, తమ వాంగ్మూలాన్ని అందించారు. వీరిద్దరు గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించారు. ఈటెల ఆర్థిక మంత్రిగా ఉండగా, హరీష్ ఇరిగేషన్ మంత్రిగా పని చేశారు. వీరిద్దరు ఇచ్చిన సమాధానాల ఆధారంగా కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘానికి  బ్యారేజీలకు ఉన్న సంబంధం ఏంటి? బ్యారేజీల నిర్మాణ స్థలాలను ఎందుకు మార్చాల్సి వచ్చింది? అనే అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్న కేసీఆర్, ఉదయం 11.30 గంటలకు బీఆర్కే భవన్ లో కాళేశ్వరం కమిషన్ చైర్మెన్ పీసీ ఘోష్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు.

గత ఏడాది మార్చాలో కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు

కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలక భాగాలైన మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతినడంతో రేవంత్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గత ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ తో చైర్మెన్ గా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన అధికారులతో పాటు నిర్మాణ సంస్థలను ప్రశ్నించింది. అందులో భాగంగానే ఈ నెల 6న ఈటెలను, 9న హరీష్ రావును ప్రశ్నించింది. ఇప్పుడు కేసీఆర్ వాగ్మూలంతో విచారణ పూర్తి కానుంది.

భారీ కాన్వాయ్ తో తెలంగాణ భవన్ కు రాక   

ఇక కాళేశ్వరం కమిషన్‌ విచారణకు కేసీఆర్‌ వస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ భారీ ఏర్పాట్లు చేసింది. ఎర్రవల్లి ఫాంహౌస్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌ కు రానున్నారు. అక్కడి నుంచి బీఆర్కే భవన్ కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.

Read Also: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఎందుకంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button