
Karimnagar Collector Pamela Satpathy: గత కొంత కాలంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వాలు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కీలక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీరు మారుతోంది. ప్రైవేటు హాస్పిటల్స్ కు ధీటుగా సేవలు అందిస్తున్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ కు సర్జరీ
ప్రభుత్వ హాస్పిటల్స్ మీద ప్రజలకు నమ్మకం పెరిగేలా పలువురు అధికారులు తరచుగా హాస్పిటల్స్ లో చెకప్స్ కు వెళ్తున్నారు. ఇప్పటి వరకు పలువురు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేయించిన సందర్భాలున్నాయి. తొలిసారి ఓ కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. అందరిచేతి శభాష్ అనిపించుకున్నారు.
కలెక్టర్ కు శ్వాస సంబంధ సమస్యలు
కరీంగనర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిల్లో కలెక్టర్ పమేలా సత్పతి సర్జరీ చేయించుకున్నారు. కలెక్టర్ గత కొద్ది కాలంగా తీవ్రమైన తలనొప్పి, ముకు దిబ్బడ, నాసిక అడ్డంకి, సైనసైటిస్, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర ‘ఎండోస్కోపీ నాజల్ సర్జరీ, సెప్టో ప్లాస్టి ఆపరేషన్ చేయించుకున్నారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జీ వీరారెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
పమేలాకు మంత్రి అభినందనలు
అటు ప్రభుత్వ హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. కలెక్టర్ నిర్ణయంతో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద నమ్మకం పెంచేలా ఉందన్నారు. కలెక్టర్ కు సక్సెస్ ఫుల్ గా ఆపరేషన్ చేసిన వైద్యుల బృందాన్ని కూడా ఆయన అభినందించారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
Read Also: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు!