
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవకపోయినా ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు భారీగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్టుకు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో జూరాల డ్యాం గేట్లు ఎత్తి.. నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 71 వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లూ 75 వేల 833 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.440 మీటర్లకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.ప్రస్తుత నీటి సామర్థ్యం 7.535 టీఎంసీలుగా ఉంది. జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 9 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
అటు తుంగభద్రకు వరద పెరుగుతోంది. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం1610.52 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 51,261 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 256 క్యూ సెక్కులు. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 38,608 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.
మరోవైపు మే నెలలో దంచికొట్టిన వరుణుడు వర్షాకాలంలో మాత్రం జారుకున్నాడు. గత రెండు వారాలుగా రాష్రంలో సరైన వర్షాలు కురవడం లేదు. జూలై 1వ వారం వరకు హైదరాబాద్తో సహా తెలంగాణలో చెప్పుకోదగ్గ వర్షాలు కురవవు, వర్షాభావము పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని తెలంగాణ వెదర్ మాన్ చెప్పారు. రైతులు తమ పంటలకు ప్రత్యామ్నాయ నీటి అవసరాలను తీర్చడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .