Tuesday, March 3, 2026
Homeక్రైమ్Jadcherla: సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట!.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Jadcherla: సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట!.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

Jadcherla: పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా సర్కారు దవాఖానాల దుస్థితి మాత్రం మారడం లేదనే విమర్శ మరోసారి నిజమైంది. ఎన్నో హామీలు, పథకాలు ప్రకటించినా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాస్తవం బయటపడుతోంది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే పాత నానుడి నేటికీ ప్రస్తుత పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. రోగులు చికిత్స కోసం వచ్చి అవస్థలు పడటం ఒకవైపు ఉంటే, కడసారి వీడ్కోలు పలకాల్సిన మృతదేహాలకు సైతం గౌరవం దక్కని దుస్థితి ఏర్పడటం వ్యవస్థలోని నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న హృదయవిదారక ఘటన ప్రజలను కలచివేసింది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ 32 సంవత్సరాల వయసున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం సోమవారం లభ్యమవడంతో పోలీసులు దర్యాప్తు నిమిత్తం ప్రభుత్వ నిబంధనల ప్రకారం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీ గదిలో ఉంచారు. అయితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విషాదకర పరిణామం చోటుచేసుకుంది. మృతదేహాన్ని సురక్షితంగా భద్రపరచాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఉంచకుండా నేలపైనే వదిలేశారు. మార్చురీ గదికి తగిన రక్షణా ఏర్పాట్లు లేకపోవడంతో లోపలికి ప్రవేశించిన వీధి కుక్కలు మృతదేహాన్ని పీక్కుతిన్నాయి. మంగళవారం ఉదయం ఈ దృశ్యాన్ని చూసిన మృతుడి బంధువులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. చనిపోయిన వ్యక్తి శరీరానికైనా కనీస గౌరవం ఇవ్వలేని స్థితికి ఆసుపత్రి వ్యవస్థ చేరుకోవడం దారుణమని వారు మండిపడ్డారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ అమానుష పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఘటన తీవ్రత దృష్ట్యా ఉన్నతాధికారులు స్పందించి విషయంపై నివేదిక కోరినట్లు సమాచారం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటన ప్రజల్లో ప్రభుత్వ వైద్య సేవలపై ఉన్న నమ్మకాన్ని మరోసారి ప్రశ్నార్థకంగా మార్చింది.

ALSO READ: Jadcherla: సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ట!.. శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments