
Karnataka Congress Politics: కర్నాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను తప్పించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే.. సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రి మార్పు
నిజానికి గత కొద్ది రోజులుగా కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. రెండు, మూడు నెలల్లో సీఎంగా సిద్ధరామయ్య ప్లేస్ లో డీకే శివ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్నారు. సమయం వచ్చినప్పుడు అధిష్టానం శివ కుమార్ కు తప్పకుండా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తుందన్నారు. అది ఈ ఏడాది కూడా జరిగే అవకాశం ఉందన్నారు. మరికొంత మంది నాయకులు సెప్టెంబర్ తర్వాత రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాలు జరగబోతాయన్నారు.
ఖర్గే ఏమన్నారంటే?
ముఖ్యమంత్రి మార్పుపై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంను మార్చాలా? వద్దా? అనే విషయం అధిష్టానం చేతుల్లో ఉందన్నారు. పార్టీకి మంచి జరిగేలా అధిష్టానం నిర్ణయాలు ఉంటాయన్నారు. పార్టీ నాయకులు ఎవరూ సీఎం మార్పు గురించి మాట్లాడకపోవడం మంచిదని ఖర్గే వెల్లడించారు. అనవసర వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించే అవకాశం ఉందన్నారు.