క్రైమ్తెలంగాణ

వీడసలు మనిషేనా..? భార్యను..! (VIDEO)

వికారాబాద్ జిల్లా సాయిపూర్ గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

వికారాబాద్ జిల్లా సాయిపూర్ గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే చివరకు భార్య ప్రాణాలు తీసిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. పరమేశ్ అనే వ్యక్తి తన భార్య అనూషను కర్రతో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేవలం 8 నెలల క్రితమే వీరి వివాహం జరగగా, ఆ ఆనందం ఇంతలోనే విషాదంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పరమేశ్-అనూషలు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని పరమేశ్ తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్పలు మొదటి నుంచే వ్యతిరేకించారు. ప్రేమ వివాహం చేసుకుందన్న కారణంతో పాటు అదనపు కట్నం తీసుకురావాలంటూ అనూషను అత్తమామలు వేధింపులకు గురిచేసేవారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపుల కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని తెలుస్తోంది.

తాజాగా మాటామాటా పెరిగిన క్రమంలో పరమేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనై అనూషను కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో అనూష అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య అనంతరం పరమేశ్ తన తల్లిదండ్రులతో కలిసి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన కీలక దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది.

కూతురు మృతి వార్తతో అనూష తల్లి చంద్రమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను వరకట్న వేధింపులతోనే హత్య చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కదలికలను గమనిస్తూ, పరారీలో ఉన్న పరమేశ్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రేమ వివాహం పేరుతో మొదలైన జీవితం, కట్న వేధింపులతో ముగియడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై జరుగుతున్న కుటుంబ హింసకు ఇది మరో దారుణ ఉదాహరణగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి నిజాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

ALSO READ: నవ వరుడితో అత్తకు అక్రమ సంబంధం.. అర్థరాత్రి అతడిని ఇంటికి పిలిచి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button