హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు కొంత ఊరట కలిగించే పరిణామాలు కనిపిస్తున్నాయి. యుద్ధ ప్రభావంతో ఈ కీలక జలసంధి మూసివేతకు గురవడంతో భారత్ సహా అనేక దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీనివల్ల భారతదేశంలో ముడి చమురు, పెట్రోలు మరియు వంటగ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది.
భారత నౌకలు సురక్షితంగా వెళ్లే అవకాశం కల్పిస్తాం
ఈ నేపథ్యంలో భారత్లోని ఇరాన్ రాయబారి డాక్టర్ అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ భారత నౌకలు హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా ప్రయాణించేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చారు. భారత్ తమకు మిత్ర దేశమని, ఈ ప్రాంతంలో రెండు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఒక చమురు నౌక భారత్కు చేరుకోగా, మరో ముడి చమురు ట్యాంకర్ త్వరలోనే చేరుకునే అవకాశం ఉందని సమాచారం. దీంతో దేశంలో ఇంధన సరఫరా పరిస్థితి కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంది.
ఇరాన్ విదేశాంగమంత్రితో మంతనాలు
ఇదే సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో ఫోన్లో మాట్లాడి పశ్చిమాసియాలో ఏర్పడిన పరిస్థితులపై చర్చించారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వం కోసం బ్రిక్స్ దేశాలు కలిసి పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గొర్ కూడా చమురు సరఫరా స్థిరత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. యుద్ధం కారణంగా హోర్ముజ్ ప్రాంతంలో ఇప్పటికే పలు వాణిజ్య నౌకలపై దాడులు జరిగినప్పటికీ, ఇరాన్ నుంచి వచ్చిన తాజా సంకేతాలు పరిస్థితిని కొంతవరకు సర్దుబాటు చేసేలా కనిపిస్తున్నాయి.
