
Israel- Iran Conflict: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ చంపాలని చూస్తుందన్నారు. టెహ్రాన్ టార్గెట్ ట్రంపేనన్నారు. ఇరాన్ కు ప్రథమ శత్రువు కూడా ఆయనే అన్నారు. అణు ఒప్పందాన్ని రద్దు చేసినందుకే ట్రంప్ ను లేకుండా చేయాలని టెహ్రాన్ ప్లాన్ చేస్తుందన్నారు.
గత ఏడాది రెండుసార్లు హత్యాయత్నం
ట్రంప్ ను హత్య చేయడానికి గత ఏడాది రెండు సార్లు ఇరాన్ ప్రయత్నించిందని నెతన్యాహూ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడన్న ఆయన, బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉండరని చెప్పారు. ప్రత్యర్థికి లొంగిపోని తీరు ఆయన సొంతమన్నారు. గతంలో జరిగిన పనికిరాని అణుఒప్పందాన్ని రద్దుచేసి.. ఖాసిమ్ సులేమానీని మట్టుబెట్టారని వెల్లడించారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని ట్రంప్ స్పష్టంగా చెప్పారన్నారు. ఇరాన్ యురేనియం శుద్ధి చేయకూడదనేదే ట్రంప్ లక్ష్యం అన్నారు. అందుకే ట్రాంప్ టెహ్రాన్ కు శత్రువుగా మారాడని తేల్చి చెప్పారు.
తమను నాశనం చేయలని చూసినందుకే!
ఇజ్రాయెల్ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడుతుందని నెతన్యాహూ వెల్లడించారు. అందుకే తాము ఆ దేశం మీద దాడులు చేయాల్సి వచ్చిందన్నారు. తమ దాడులు ఇరాన్ అణు వ్యవస్థలను చాలా వరకు నాశనం చేశాయని చెప్పారు. ప్రపంచ దేశాలన్నింటికీ ఇరాన్ పెనుముప్పుగా మారుతున్నదన్నారు. అందుకే, తమకు దాడులు చేయడం తప్ప మరో మార్గం కనిపించలేదన్నారు. ముప్పును నామరూపాలు లేకుండా చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఇజ్రాయెల్ తనను తానే కాకుండా, ప్రపంచాన్ని రక్షించేందుకు ఈ దాడుల తప్పడం లేదన్నారు.
Read Also: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భగ్గుమంటున్న పశ్చిమాసియా!