* గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలపై దాడి చేస్తాం
* అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ప్రారంభమైన యుద్ధం ఇప్పటికే 12వ రోజుకు చేరుకుంది. ఇదే సమయంలో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఇంకా ఉధృతం చేయడానికి సిద్ధమని ఇరాన్ తాజాగా ప్రకటించింది. ఇకపై అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆర్థిక సంస్థలు, బ్యాంకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇరాన్ మిలిటరీ సెంట్రల్ ఆపరేషనల్ కమాండ్ ఖాటమ్ అల్ అన్బియా అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
ప్రజలకు ముందస్తు సమాచారం
ప్రజలు ఆ సంస్థలు, బ్యాంకుల దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండాలని కూడా ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక కీలక బ్యాంకుపై అర్ధరాత్రి దాడి చేసింది. ఈ దాడిలో పలువురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ తమ బ్యాంకులపై దాడి చేయడం ద్వారా ఇలాంటి ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకునే చర్యలకు తగిన కారణం ఇచ్చిందని ఇరాన్ పేర్కొంది. అందుకే ఇకపై అమెరికా, ఇజ్రాయెల్కు చెందిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులపై ప్రతిదాడులు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా అక్కడి ప్రజలు కూడా అలాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.
టెక్ కంపెనీలపై దాడులు చేస్తాం!
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీలపై కూడా దాడులకు సిద్ధమవుతున్నట్లు ఇరాన్ తెలిపింది. ఇప్పటికే దాడులకు సంబంధించిన లక్ష్య సంస్థల జాబితాను కూడా ప్రకటించింది. ఆ జాబితాలో ప్రముఖ అమెరికన్ టెక్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, పాలంటిర్, నివిడియా, ఒరాకిల్ వంటి సంస్థలు గల్ఫ్ దేశాలు మరియు ఇజ్రాయెల్లో పలు కార్యాలయాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ప్రస్తుతం ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఒకరిపై ఒకరు చమురు సంస్థలు, ఆర్థిక కేంద్రాలపై దాడులు జరుపుతున్నాయి. యుద్ధ ప్రభావంతో హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా కూడా అంతరాయం కలిగింది. దీనివల్ల ఇండియా, చైనా వంటి అనేక ఆసియా దేశాలు ఇంధన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
