Tuesday, March 17, 2026
HomeజాతీయంHydrogen Train: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు, రైల్వేమంత్రి కీలక ప్రకటన!

Hydrogen Train: పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్ రైలు, రైల్వేమంత్రి కీలక ప్రకటన!

First Hydrogen Train In India: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ఇప్పటికే అత్యాధునిక సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి తీసుకురాగా, ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించబోతోంది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలును అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ రైలు పైలట్‌ ప్రాజెక్టుగా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇది అందుబాటులోకి వస్తే భారతీయ రైల్వే కూడా గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లో చేరనుంది. రిసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్దేశిత ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు.

హైడ్రోజన్ రైలు గురించి కీలక ప్రకటన

తాజాగా లోక్‌సభ వేదికగా రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ వివరాలు వెల్లడించారు. దేశంలో తొలి హైడ్రోజన్‌ రైలు నిర్మాణం పూర్తయిందని, దీన్ని పూర్తిగా దేశీయంగా రూపొందించి అభివృద్ధి చేశామని చెప్పారు. ఈ రైలు నిర్వహణ కోసం హరియాణాలోని జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ప్లాన్‌ చేశామన్నారు. ఇది పూర్తిగా భారత్‌లోనే రూపొందించి అభివృద్ధి చేసిన హైడ్రోజన్‌ రైలు. పది కోచ్‌లతో కూడిన ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్‌ రైలుగా గుర్తింపు పొందింది. బ్రాడ్‌గేజ్‌ ట్రాక్‌పై నడిచే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్‌ రైలు కూడా ఇదే.

హైడ్రోజన్ రైలు గురించి..

హైడ్రోజన్ రైలులో 1200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు డ్రైవింగ్‌ పవర్‌ కార్లు, 8 ప్యాసింజర్‌ కోచ్‌లు ఉంటాయి. ఇది హైడ్రోజన్‌ ఇంధనాన్ని ఉపయోగించి రసాయన చర్య ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి నడుస్తుంది. పర్యావరణానికి హానిచేసే కార్బన్‌డయాక్సైడ్‌ను విడుదల చేయదు. అంటే సున్నా కర్బన ఉద్గారాలతో పూర్తిగా పర్యావరణ హితమైనది. పర్యావరణ అనుకూల ప్రయాణంలో ఇదొక గేమ్‌ చేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే భవిష్యత్తులో హైడ్రోజన్‌ రైళ్ల విస్తరణకు మార్గం సుగమంఅవుతుంది. ముఖ్యం గా విద్యుత్‌ ట్రాక్‌లులేని మార్గాల్లో ఈ రైళ్లను నడిపే వీలుకలుగుతుంది.

Read Also: కేరళలో బీజేపీ జోరు, తిరువనంతపురం కార్పొరేషన్‌ లో తొలిసారి విజయం!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments