
Jai Shankar Warning: దాయాది దేశం పాకిస్తాన్ కు భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదంతో రెచ్చగొడితే, పాకిస్తాన్ లోపలికి వచ్చి మరీ దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. ఇకపై పహల్గాం లాంటి దాడులు జరిగితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ లో అలజడులు సృష్టించే ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఎక్కడ దాక్కున్నా వదలబోమన్నారు. దెబ్బకు పదింతలు గట్టి దెబ్చతీస్తామని హెచ్చరించారు.
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం!
ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ ఉన్న భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తూ, భారత్ మీదికి ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందన్నారు. పాక్ లో ట్రైనింగ్ తీసుకున్న ఎంతో మంది ఉగ్రవాదులు, భారత్ లో అమాయకులను పొట్టనపెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదన్నారు. పాకిస్తాన్.. భారత్ మీద దాడులకు ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా మార్చుకుందని మండిపడ్డారు. ఇకపై ఆ తరహా వ్యవహారాన్ని ఇండియా చూస్తూ ఊరుకోదన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో పెకిలించి వేస్తామన్నారు.
ఉగ్రవాదం ప్రపంచ సమస్యగా భావించాలి!
పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదానికి వెన్నంటి ఉందని మంత్రి జైశంకర్ అన్నారు. ఉగ్రవాదంతో ఉద్రిక్తతలు పెంచడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉంటే, ఉద్రిక్త పరిస్థితులు ఇంకా ఉన్నట్లేనని ఆయన వెల్లడించారు. అటు యుద్ధం సందర్భంగా జరిగిన నష్టం గురించి సంబంధిత అధికారులు సమాధానం చెప్తారన్నారు. ఉగ్రవాదం అనేది ఏ దేశానికి చెందిన సమస్య కాదన్న ఆయన, మొత్తం ప్రపంచ సమస్యగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం యావత్ మానవాళికి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశం అన్నారు. అన్ని దేశాలు ఉగ్రవాదం మీద కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు మరికొన్ని దేశాలు అండగా నిలవడం నిజంగా దారుణమైన విషయం అన్నారు.
Read Also: బేడీలు వేసి, నేల మీద పడేసి.. భారతీయ విద్యార్థిపై అమెరికా అధికారుల అమానుషం!