ఆంధ్ర ప్రదేశ్

వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 22 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తరుణంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పంట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వచ్చాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. ఇక నైరుతి రాకతో.. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పోయారు. పొలాలను చదును చేసి విత్తనాలు పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు అక్కడక్కడ పంట పొలాల్లో రైతు నేస్తాలు ఆరుద్ర పురుగులు సైతం దర్శనమిస్తున్నాయి. దీంతో రైతన్నలు ఆనందంతో పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button