
North Indian Rains: ఉత్తర భారతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, మధ్య, ఈశాన్య రాష్ట్రలు కుండపోత వానలతో అతలాకుతలం అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో కుంభవృష్టిగా వాన పడింది. యమునోత్రి జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నిర్మాణంలో ఉన్న హోటల్ కుప్పకూలింది. ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు స్పాట్ లోనే చనిపోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి 18 కిలో మీటర్ల దూరంలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన సమయంలో 29 మంది ఉన్నారు. వారిలో 20 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష కోసం యువకుల పోరాటం
అటు రుద్రప్రయాగ్ లోని బంగర్ పట్టిలో 12 ఊళ్లను కలిపే వంతెన కూలిపోయింది. అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రాంతీయ సివిల్ సర్వీస్ పరీక్ష రాయడానికి అక్కడి యువకులు ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్లారు. మరోవైపు ఝార్ఖండ్ తూర్పు సింగ్బూమ్ జిల్లాలో భారీ వర్షం ఓ పాఠశాల ముగినిపోయింది. అందులో చిక్కుకున్న162 మంది విద్యార్థులను స్థానికులు కాపాడారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చార్ ధామ్ యాత్రకు బ్రేక్
భారీ వరదల కారణంగా చార్ ధామ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. 24 గంటల పాటు ఈ యాత్రను నలిపివేస్తున్నట్లు వెల్లడించారు. హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ ప్రయాగ్, డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీల్లో ఉన్న యాత్రికులను ముందుకు వెళ్లకుండా అధికారులు ఆపారు. వాతావరణ పరిస్థితులను అంచనా వేసి తరుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
వారం రోజులు భారీ వర్షాలు
అటు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
Read Also: శ్రీశైలం ప్రాజెక్టులోకి పోటెత్తిన వరద, త్వరలో గేట్లు ఓపెన్!