
Hyderabad Bonalu 2025: ఆడపడుచులకు ఇష్టమైన బోనాల పండుగకు హైదరాబాద్ రెడీ అవుతోంది. ఆషాడమాసం బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే బోనాల పండుగకు సంబంధించి మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది బోనాల కోసం ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. దేవాదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు ఈ నిధులను అందించనుంది. దేవాలయాలను అందంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది.
జూన్ 26న తొలి బోనం
ఈ నెల 26న గోల్కొండ బోనాలతో గ్రేటర్ పరిధిలో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. 13న ఉజ్జయినీ మహంకాళి బోనాలు జరగుతాయి. 14న రంగం ఏర్పాటు చేస్తారు. 20న పాతబస్తీ అక్కన్న, మాదన్న బోనాల జాతర జరుగుతుంది. 24న బోనాల ఉత్సవాలు సమాప్తం కానున్నాయి.
ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా జాగ్రత్తలు!
తాజాగా మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆషాఢ బోనాల ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు, తాగునీరు, పారిశుధ్యం, ఎలక్ట్రిసిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రేటర్ పరిధిలోని 3,026 దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. గతంతో పోల్చితే ఈసారి నిధులు పెంచినట్లు వెల్లడించారు. ఒకవేళ ఏదైనా దేవాలయానికి నిధులు రాకపోతే, అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధతో సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.