బీహార్ రాష్ట్రంలో ఆశ్చర్యానికి గురిచేసే ఒక అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని రోహ్తాస్ జిల్లా పరిధిలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహిత అయిన ఒక మహిళకు, ఆమె భర్త స్నేహితుడైన వ్యక్తితో అదే భర్త సమక్షంలోనే వివాహం జరగడం స్థానికంగా పెద్ద సంచలనం సృష్టించింది. సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగిన ఈ పరిణామాన్ని కొందరు స్నేహానికి పరీక్షగా భావిస్తుండగా, మరికొందరు పవిత్రమైన వివాహ బంధానికి సవాలుగా అభివర్ణిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ మొదలైంది.
రోహ్తాస్ జిల్లాలోని నట్వర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడు జీవనోపాధి కోసం ఢిల్లీ నగరంలో నివసిస్తూ ఉండేవాడు. అతనికి 2021 జూన్లో వివాహం జరగగా, ఈ దంపతులకు ఒక బిడ్డ కూడా ఉంది. ఇదే సమయంలో అతని స్నేహితుడు కూడా అదే ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తూ ఉండటం వల్ల వారి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. స్నేహితులుగా ఉండే ఈ ఇద్దరూ తరచుగా ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లేవారు. ఈ పరిచయం క్రమంగా మారుతూ, ఆ యువకుడు తన స్నేహితుడి భార్యకు దగ్గరవడం జరిగింది. మొదట సాధారణంగా ఫోన్ ద్వారా మాట్లాడటం ప్రారంభమైన ఈ పరిచయం, తర్వాత వ్యక్తిగతంగా కలుసుకునేంత వరకు వెళ్లి, చివరకు ప్రేమగా మారింది.
ఇంతలో హోలీ పండుగ సందర్భంగా ఆ యువకుడు తన భార్యతో కలిసి స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం కొంత పనిమీద గుజరాత్ కు వెళ్లిపోయాడు. భర్త దూరంగా ఉండడంతో ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లింది. ఇదే సమయంలో ఆమెను కలుసుకోవడానికి ఢిల్లీ నుంచి ఆమె ప్రియుడు కూడా గ్రామానికి చేరుకున్నాడు. ఆ తర్వాత వారు తరచుగా కలుసుకుంటూ తమ సంబంధాన్ని కొనసాగించారు. ఈ పరిణామం గురువారం 19 మార్చి రాత్రి తీవ్ర మలుపు తిరిగింది. ఆ రాత్రి ప్రియుడు ఆమె ఇంటికి వెళ్లగా, కుటుంబ సభ్యులు వారిని అభ్యంతరకర పరిస్థితిలో పట్టుకున్నారు. దీంతో అక్కడే పెద్ద గందరగోళం నెలకొంది. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేయగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ సంఘటనపై వెంటనే గ్రామ పంచాయతీని ఏర్పాటు చేశారు. రాత్రంతా కొనసాగిన ఈ సమావేశంలో ఇరు పక్షాలను పిలిపించి విషయాన్ని పరిష్కరించేందుకు పెద్దలు ప్రయత్నించారు. అయితే ఆ మహిళ, ఆమె ప్రియుడు కలిసి జీవించాలనే నిర్ణయంపై కట్టుబడి ఉన్నారు. చివరకు పంచాయతీ నిర్ణయం, అలాగే భర్త అంగీకారం మేరకు శుక్రవారం 20 మార్చి ఉదయం దినారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని హనుమాన్ ఆలయంలో ఈ ఇద్దరికి వివాహం జరిపించారు. దేవుడి సాక్షిగా పూలమాలలు మార్చుకుని, సంప్రదాయ పద్ధతిలో వివాహ తంతు పూర్తి చేశారు.
ఈ ఘటనలో అత్యంత ఆశ్చర్యకర అంశం ఏమిటంటే.. ఈ వివాహం జరుగుతున్న సమయంలో ఆ మహిళ మొదటి భర్త కూడా అక్కడే ఉండటం. అతని అంగీకారంతోనే పంచాయతీ ఈ రెండవ వివాహానికి అనుమతి ఇచ్చింది. ఆ మహిళకు 4 సంవత్సరాల కుమారుడు ఉండగా, వివాహం అనంతరం అతను తల్లితోనే ఉండాలని పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఢిల్లీలో కలిసి జీవించిన ఈ ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది.
ALSO READ: కోతుల బెడదతో సర్పంచ్లకు కొత్త కష్టాలు.. ఎలుగుబంటిగా మారిన సర్పంచ్
