Monday, February 16, 2026
HomeతెలంగాణHigh Alert: రెండు రోజులు జాగ్రత్త

High Alert: రెండు రోజులు జాగ్రత్త

High Alert: తెలంగాణ రాష్ట్రాన్ని గత 3 వారాలుగా కఠినమైన చలిగాలులు గట్టిగా వణికిస్తున్నాయి. వరుసగా 24వ రోజూ చలి తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో జనజీవనం స్తంభించినట్టే కనిపిస్తోంది. ఉదయం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండటంతో సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చలి తీవ్రతతో వృద్ధులు, చిన్నపిల్లలు, కూలీలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తిర్యాణిలో 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రతకు నిదర్శనంగా మారింది. ఇదే తరహాలో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 5.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యంత చల్లని ప్రాంతంగా నిలిచింది. ఈ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు చలిని తట్టుకోవడానికి తెల్లవారుజామున, రాత్రి వేళ చలిమంటల వద్దే సమయం గడుపుతున్నారు.

ఇక భాగ్యనగరం హైదరాబాద్‌లో కూడా ఈసారి చలి ఊహించని స్థాయిలో ప్రభావం చూపుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త వెచ్చగా ఉండే నగరంలోనూ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోవడం గమనార్హం. శేరిలింగంపల్లిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిసరాల్లో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10 డిగ్రీలు, మౌలాలి ప్రాంతంలో 10.2 డిగ్రీలు, గచ్చిబౌలిలో 10.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదై చలిగాలులు నగరవాసులను వణికిస్తున్నాయి.

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో రోడ్లపై దృశ్యమానత తగ్గిపోయింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు మరింత అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం వేళ చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నెలలో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల పగటి పూట భూమి గ్రహించిన వేడి రాత్రివేళ వేగంగా అంతరిక్షంలోకి వెళ్లిపోతోంది. అదే సమయంలో హిమాలయాల నుంచి వీస్తున్న పొడి, శీతల గాలులు నేరుగా తెలంగాణ మీదుగా ప్రవహించడం చలి తీవ్రతను మరింత పెంచుతోంది. రాత్రి వేళ భూమి ఉపరితలం వేగంగా చల్లబడటం కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడానికి ప్రధాన కారణంగా మారింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు ఇదే స్థాయిలో చలి కొనసాగుతుందని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా ఉదయం వేళ బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.

వైద్యులు కూడా ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు తెల్లవారుజామున బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, గోరువెచ్చని నీరు తాగడం, వేడి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చలి తీవ్రత తగ్గే వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: డ్యూటీ వేళ మహిళా కానిస్టేబుల్ ఇన్‌స్టా రీల్స్

RELATED ARTICLES

Most Popular

Recent Comments