
IMD Rains Alert: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ కావడంతో వానాలు మళ్లీ వానలు మొదలైనట్లు వెల్లడించింది. సోమవారం నుంచి మొదలైన వానలు, ఈనెల 14 వరకు కురుస్తాయని తెలిపింది. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు
ఇక తెలంగాణలో జూన్ 11 నుంచి 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతపవనాల కదలికలకు అనుకూల వాతావరణం ఉండటంతో వర్షాలు పడుతున్నాయని తెలిపింది. మంగళవారం నాడు హైదరాబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఆకాశం మేఘావృతమై కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, నారాయణపేట, మెదక్, కామారెడ్డి. నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో జూన్ 14న భారీ వర్షాలు
ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ వానలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా కదలడంతో పాటు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇవి మరింతగా జోరందుకోనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడునున్నట్లు వెల్లడించింది. జూన్ 14న మరో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. వీటికి రుతుపవనాలు యాడ్ కావడంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరప్రాంత ప్రజలు మరింత అలర్ట్ గా ఉండాలని సూచించింది.
Read Also: బోనాలకు సిద్ధం అవుతున్న భాగ్యనగరం.. ఎప్పటి నుంచి అంటే!