క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ కు షాక్ తగిలింది. ఆయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఆరేళ్ల కిందట జరిగిన ఓ ఘటనకు సంబంధించి న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆత్మహత్యాయత్నం కేసుగా పరిగణలోకి తీసుకొని కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై స్పందించారు గుడివాడ అమర్నాథ్. న్యాయ సహాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తానని కూడా చెప్పారు.. అయితే సాధారణంగా గుడివాడ అమర్నాథ్ విషయంలో ఏ వార్త అయినా సోషల్ మీడియాలో ట్రెండిగా నిలుస్తుంది. అది సర్వసాధారణం కూడా. ఇప్పుడు కూడా ఆయన జైలు శిక్ష అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ గతంలో ఆయన ఓ నిరసనకు హాజరైన క్రమంలో నమోదైన కేసులో భాగంగానే అని తెలియడం.. అంతా తేలిగ్గా తీసుకుంటున్నారు.
రైల్వే జోన్ కోసం..
2016లో ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టింది. ఆ సమయంలో గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రయత్నించారన్న కేసు నమోదు అయింది. అప్పటినుంచి కోర్టులో విచారణ కొనసాగుతోంది. నిన్ననే కోర్టులో తుది విచారణ జరిగింది. న్యాయమూర్తి గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలలపాటు జైలు శిక్ష విధిస్తూ.. 5000 రూపాయల జరిమానా విధించారు. అయితే గుడివాడ అమర్నాథ్ ఈ ఘటనపై స్పందించారు. హైకోర్టులో ఆపిల్ చేస్తానని చెప్పారు. అంతటితో ఆగకుండా తన వల్లే విశాఖ రైల్వే జోన్ వచ్చిందని ప్రకటించుకున్నారు.
వైసిపి హయాంలో జాప్యం..
విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇస్తామని విభజన హామీల్లోనే అప్పట్లో పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించారు. కానీ వైసీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎటువంటి భూములు కేటాయించలేదు. కనీసం దాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. విశాఖకు చెందిన మంత్రిగా. కీలక నేతగా ఉన్న గుడివాడ అమర్నాథ్ సైతం దీనిపై దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు పాత కేసులో తీర్పు పుణ్యమా అని.. గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక రైల్వే జోన్ తన వల్లే వచ్చింది అని ప్రకటించుకోవడం గమనార్హం.
